నేరేడుచర్ల, జూలై 20: కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా 3 గంటల కరెంటేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి రైతులపై కపట ప్రేమ చూపుతున్నదని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆదమరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కోతలు, వాతలు తప్పవని హెచ్చరించారు. 3 గంటల విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండాలో భాగమేనని స్పష్టం చేశారు.
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని, వారు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ భస్మం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిరంతర విద్యుత్తు సరఫరా నిజమైతే.. వారు పాలించే రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, పైగా అక్కడి ప్రభుత్వం విద్యుత్తును అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నదని విమర్శించారు. సాగుకు 3 గంటల విద్యుత్తు సరఫరా అనేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాయేనని, అది బుడ్డర్ ఖాన్ నోటి నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. అదే పార్టీకి చెందిన మరో పేపర్ పులి నోటి నుంచి ఉచిత విద్యుత్తు కొనసాగిస్తామని, సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని అన్న మాటలు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం రూపొందించుకున్న రహస్య ఎజెండాలోనివేనని పేర్కొన్నారు. పింఛన్లను మళ్లీ 200కు కుదించి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు మంగళం పాడుతారని, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎత్తివేస్తారని ప్రజలను హెచ్చరించారు. అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని విమర్శించారు.