హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి కనీసం గేట్లు కూడా తీయకపోవడం దారుణమని, ఇందుకు కారకులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం దళితులను ఆకాశానికి ఎత్తితే కాంగ్రెస్ ప్రభుత్వం అవమానాలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ దూరదృష్టితో దళితబంధు పథకాన్ని తెస్తే ఆ పథకాన్ని దురుద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసిందని మండిపడ్డారు.