హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శనం. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ర్టానికి వచ్చిన ఆదాయం వివరాలను ‘కాగ్’ ఈ నివేదికలో వెల్లడించింది. అందులోని గణాంకాల ప్రకారం రాష్ర్టానికి పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం (ట్యాక్స్ రెవెన్యూ) కేసీఆర్ పాలనలో కంటే రేవంత్రెడ్డి పాలనలో భారీగా తగ్గడమే కాకుండా రాష్ట్రం మరింత లోతుగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో పన్నుల ద్వారా వచ్చిన వార్షిక ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 92% వరకు ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అది కేవలం 79.34 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రూ.1,75,319.36 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా ఫిబ్రవరి నాటికి రూ.1,39,100.81 కోట్లు మాత్రమే వచ్చింది. పన్నేతర ఆదాయం (నాన్-ట్యాక్స్ రెవెన్యూ) కూడా 28.80 శాతానికే పరిమితమైంది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడికి మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది.
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి మొత్తం రూ.2,84,837.30 కోట్ల రాబడులు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా.. ఫిబ్రవరి నాటికి రూ.2,31,500.48 కోట్లు (81.27 శాతం) మాత్రమే వచ్చాయి. అందులో రూ.77,111.10 కోట్లు అప్పులే. ఓపెన్ మారెట్ నుంచి ప్రభుత్వం సమీకరించిన రుణాలు బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 142.77 శాతానికి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నది. సొంత రాబడులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి ప్రభుత్వం పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తున్నది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,738.35 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేయగా.. ఫిబ్రవరి నాటికి రూ.14,364.61 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. అంటే మైనస్ 524.57% రెవె న్యూ లోటు ఉన్నది. ఇదేవిధంగా వార్షిక ద్రవ్యలోటు రూ.54,009.72 కోట్ల మేరకు ఉం టుందని బడ్జెట్లో అంచనా వేయగా.. ఫిబ్రవరి నాటికే ఇది రూ.77,111.10 కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 142.77 శాతం)గా నమోదైంది. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన గ్రాంట్లు కేవలం 26.95 శాతానికే పరిమితమయ్యాయి. రెవెన్యూ వ్యయం రూ.1,68,711 కోట్లకు చేరింది. అభివృద్ధి పనులకు వెచ్చించే మూలధన వ్యయం 132.67 శాతానికి పెరిగినప్పటికీ అందులోనూ అప్పులే అధికంగా ఉండటం రాష్ట్రంపై భారాన్ని పెంచుతున్నది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను వసూళ్లలో పట్టు కోల్పోవడం, కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టుకోలేకపోవడం, విచ్చలవిడిగా అప్పులపై ఆధారపడటం తెలంగాణను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
