మోర్తాడ్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం చెంది, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలన తీరుపై విసుగు చెందిన ప్రజల్లో మళ్లీ కేసీఆర్ రావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడిందని, దీంతో ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెండోరా మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు మంగళవారం వేముల సమక్షంలో బీఆర్ఎఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కమ్మర్పల్లిలో వాల్రైటింగ్ను ప్రారంభించారు.
జహీరాబాద్, ఏప్రిల్ 15: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావడానికి గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. సభను విజయవంతం చేసేలా ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు చెప్పారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే మాణిక్రావు రజతోత్సవ సభ వాల్రైటింగ్ రాశారు.