రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో నర్సింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫీజు కట్టలేదని యాజమా న్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బకాయిల చెల్లింపును సర్కార్ వాయిదా వేస్తూ వస్తుండటం వల్ల అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ సర్కార్ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. నర్సింగ్ విద్యకు విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియాల్లో నేను పర్యటించినప్పుడు నర్సింగ్కు ఉన్న డిమాండ్ తెలుసుకున్నా.. ఇంజినీరింగ్ విద్యార్థుల కన్నా నర్సులకు ఎక్కువ జీతాలు చెల్లించే పరిస్థితి ఉన్నది’ పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లి వద్ద నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలివి. రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు రెండేండ్లుగా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలేదు. దీంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభు త్వం మాత్రం దసరా, దీపావళి, సంక్రా ంతి అంటూ స్కాలర్షిప్ బకాయిల చెల్లింపు గడువును మారుస్తూ వస్తున్నది.
రాష్ట్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు (45), ప్రైవేట్ కళాశాలలు (150), జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎమ్) స్కూళ్లు 190 వరకు ఉన్నాయి. నర్సింగ్ వృత్తిలోకి ప్రవేశించాలంటే బీఎస్సీ (నర్సింగ్), జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా కళాశాలలు, స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీకి చెందిన వేల మంది విద్యార్థులు నర్సింగ్ విద్య అభ్యసిస్తున్నారు. విదేశాల్లో మంచి వేతనాలు, ఉపాధి అవకాశాలు ఉండటంతో ఈ కోర్సుకు డిమాండ్ పెరిగింది. నర్సింగ్ కోర్సుల్లో పేద, గ్రామీణ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎక్కువగా చేరుతున్నారు. ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు బీఎస్సీ (నర్సింగ్)కి ఏడాదికి రూ.45,000, జీఎన్ఎం చదువుతున్నవారికి సంవత్సరానికి రూ.30,000 ట్యూషన్ ఫీజు, మెస్ చార్జీల కింద రూ.15,000 స్కాలర్ షిప్ కింద చెల్లించాల్సి ఉన్నది.
ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు బకాయిలు ఉన్నాయన్న కారణంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో కోర్సు ముగిశాక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని బాధపడుతున్నారు.