యాదగిరిగుట్ట, జనవరి 22: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజా అవసరాల కోసం నిర్మించిన యువజన సంఘం భవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఆదివారం అర్ధరాత్రి అధికారులు, 100 మంది పోలీసులతో యువజన సంఘం భవనాన్ని జేసీబీలతో నేలమట్టం చేశారు. గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య రూ.27 లక్షల సొంత నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేయడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మించారన్న ఆరోపణతో గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదేశాలతో అధికారులు ఈ ఘటనకు ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సోమవారం మల్లాపురానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆలేరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే అలజడి సృష్టించి గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలోనే నిర్మించారని నిర్ధారణ జరిగితే ఆ భవనాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగిస్తే బాగుండేదని చెప్పారు. ఎమ్మెల్యే అయిలయ్య ఒత్తిడితో అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారని ఆరోపించారు.