హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని పిలిచిన ప్రభుత్వం, మంత్రులు తోక ముడిచి పారిపోయారని మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వివరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , తాను, నాయకులు, చర్చలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకున్నారని దుయ్యబట్టారు. చర్చల నుంచి తప్పించుకోవడంలో ఆంతర్యమేముందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకరోజు , మరో రోజు రూ.7 లక్షల కోట్లని మాటమార్చి చర్చలకు రాకుండా మంత్రి జూపల్లి తోక ముడిచారని విమర్శించారు. గతంలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తాను పాల్గొని బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల గురించి డిటేల్డ్గా మాట్లాడి ప్రభుత్వం నోరును మూయించానని వెల్లడించారు. నాటి సమావేశంలో తాను చేసిన సవాలుకు సమాధానం ఇవ్వకుండా అసెంబ్లీని వాయిదా వేశారని గుర్తు చేశారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ చేసిన అప్పుల విషయంలో గాని, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ సమావేశంలో గాని, ఇంకెక్కడైనా సరే చర్చ పెడితే సమాదానం ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి కోసం చర్చల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని ఏర్పాటు చేయగా తెలంగాణ అమరవీరుల వద్దకు రమ్మని మంత్రి జూపల్లి కోరితే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైన కేటీఆర్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలకు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల టెండర్ల విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయని వీటిపై కూడా చర్చల నుంచి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. చర్చలకు రమ్మన్న ముగ్గురు మంత్రులకు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తలేదని, వారి వద్దకు వెళ్లడానికి అనుమతి కావాలని కోరిన తమను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారని తెలిపారు. చర్చలు జరిగితే కాంగ్రెస్ బండారం అంతా బయటపడుతుందని భయంతో, చర్చలు జరగకుండా అరెస్ట్ చేశారని హరీష్రావు ఆరోపించారు.