Congress | హైదరాబాద్, అక్టోబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటమి తప్పదని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులకు తెరలేపింది. ఫేక్ సర్వేలతో ప్రజలను మోసగించేందుకు స్కెచ్ వేసింది. ఇందుకోసం ఊరూపేరూ లేని సంస్థల పేరుతో ప్రముఖ వెబ్సైట్లను, సోషల్మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న వారిని సంప్రదిస్తున్నది. తమకు అనుకూలంగా తామిచ్చే ఫేక్ సర్వేను పోస్ట్ చేస్తే, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ ప్రలోభపెడుతున్నది. దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడటంతో కాంగ్రెస్ అసలు గుట్టు రట్టయ్యింది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
‘తెలుగు స్ర్కైబ్’ అనే మీడియా సంస్థను, జర్నలిస్ట్ సాయికి చెందిన ఐవీడీ ప్రభాస్ పేరిట ఉన్న ట్విటర్ (ఎక్స్) ఖాతాను కొందరు సంప్రదించారు. బెంగళూరులోని ‘ది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్’ అనే సంస్థకు చెందిన ప్రతినిధులమని చాటింగ్ ద్వారా తమను తాము పరిచయం చేసుకొన్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న తమ సర్వేను సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తే, అడిగినంత డబ్బు ఇస్తామంటూ మభ్యపెట్టారు. సమాధానం చెప్పాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. నకిలీ సర్వే నివేదికను కూడా పంపించారు. దీంతో ‘కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న సర్వేను పోస్ట్ చేయాలంటూ తమను బలవంతపెడుతున్నారని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం అంటున్నారం’టూ.. ఈ ఉదంతం మొత్తాన్ని ‘తెలుగు స్ర్కైబ్’తోపాటు జర్నలిస్ట్ సాయి తమ ఖాతాల ద్వారా తెలియజేశారు. ఆధారాల కోసం చాటింగ్ హిస్టరీ స్క్రీన్షాట్లను కూడా పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఫేక్ సర్వేల గుట్టురట్టయ్యింది. ప్రజలను మోసపుచ్చి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను దొంగదెబ్బ కొట్టడానికే కాంగ్రెస్ ఈ తరహా డర్టీ పాలిటిక్స్కు దిగిందని పలువురు విమర్శిస్తున్నారు. దొంగ సర్వేలతో తప్పుడు ఫలితాలు చూపించినంత మాత్రాన తాము ఎంతమాత్రం మోసపోబోమని, బీఆర్ఎస్కే తమ ఓటు అని తెలంగాణవాదులు తేల్చిచెప్తున్నారు.
కాంగ్రెస్ ఫేక్ సర్వే కేటుగాళ్లు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న ఖాతాలనే లక్ష్యంగా చేసుకొని సంప్రదింపులకు దిగినట్టు అర్థమవుతున్నది. ‘తెలుగు స్ర్కైబ్’ ట్విటర్ ఖాతాను 26 వేల మంది అనుసరిస్తుండగా, ఐవీడీ ప్రభాస్ ఖాతాను 65 వేల మంది ఫాలో అవుతున్నారు. వీరితో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న వారిని ఈ కేటుగాళ్లు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో తమ గెలుపు తథ్యమని ఇటీవల తమ ట్విటర్ ఖాతాలో ఆర్భాటంగా ప్రకటించుకొన్న కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. 2018 నవంబర్ 10న విడుదలైన ఓ ఫెయిల్ సర్వేను తాజా సర్వేగా ఏమారుస్తూ ఆ పార్టీ పోస్ట్ చేసింది. అయితే, ఆ నివేదికపై తేదీ ఉండటంతో కాంగ్రెస్ ఫేక్ గుట్టురట్టయ్యింది.