స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): వైఎస్ షర్మిలను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని ఆ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిని నెత్తిన పెట్టుకునే కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని పేర్కొన్నారు. మళ్లీ ఆ తప్పు చేయదలుచుకోలేదని అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రులు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, మర్రి చెన్నారెడ్డికీ కూడా కూతుళ్లు ఉన్నారని, మరి వారంతా కాంగ్రెస్లో చేరుతున్నారా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రుల కూతుళ్లు ఎలాగో షర్మిల కూడా అంతేనని అభిప్రాయపడ్డారు. షర్మిల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ ఇడుపులపాయకు రావడం లేదని తెలిపారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్లో చేరేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.