Telangana Assembly Elections | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ భారత్ రాష్ట్ర సమితి విజయ దుందుబి మోగించింది. పార్లమెంట్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి ఘన విజయం సాధించారు. ఉప్పల్లో కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపొందారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కూన శ్రీశైలం గౌడ్పై 85,576 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీశైలం గౌడ్కు 1,02,423 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థి కోలన్ హన్మంత్రెడ్డి 1,01,554 ఓట్లు వచ్చాయి. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సైతం మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్పై గెలుపొందారు. ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి విజయం సాధించారు.
సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ మూడోస్థానానికే పరిమితమయ్యారు. మేడ్చల్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జానయ్య యాదవ్పై మల్లారెడ్డి 33,419 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచినా.. రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలువకపోవడం గమనార్హం.