Congress | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు కినుక వహించారా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్కు పూర్తిస్థాయిలో ఐదేండ్ల పాటు సీఎం పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరని తెలుస్తున్నది. కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా సీఎం పీఠం పంపకాలు జరగాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు సీఎం పదవిపై సగం-సగం ఫార్ములాను అధిష్ఠానం ముందు ఉంచినట్టు తెలిసింది. సీఎం పదవీ కాలం మొత్తం రేవంత్ ఒక్కరికే ఇవ్వకుండా రెండున్నరేండ్లు రేవంత్రెడ్డికి, మిగిలిన కాలం సీనియర్లలో ఒకరికి ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్టు సమాచారం! తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆ తర్వాత సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో సీనియర్లు ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చేసరికి అధిష్ఠానంలో ఆందోళన మొ దలైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అధిష్ఠానం పెద్దలతోపాటు రేవంత్రెడ్డి అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
తెలంగాణ మంత్రివర్గ కూర్పుపైనా కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. మంత్రి పదవుల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకోవడంతో ఎవరికి ఇవ్వాలన్నది తేల్చులేకపోతున్నట్టు తెలుస్తున్నది. పలువురు ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. తమకు తెలిసిన వారితో అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. కచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని వారు పట్టుబడుతున్నట్టు సమాచారం. అధిష్ఠానం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదని తెలిసింది. గురువారం సీఎంతో పాటు మం త్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు మం త్రివర్గంలో ఎవరికి చోటు దక్కిందనే అంశంపై స్పష్టత రాకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో గురువారం సీఎం ఒక్కరే ప్రమాణం చేస్తారా? లేక ఆయనతో పాటు కొందరు మంత్రులెవరైనా ప్రమాణం చేస్తారా? అనేది తేలాల్సి ఉన్నది. అటు, మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి.. తన మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్టు తెలిసింది. తన జాబితాను పార్టీ పెద్దలకు అందించగా, వారు కూడా ఓ జాబితాను రేవంత్కు అందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా చర్చించి మంత్రివర్గ జాబితాను రూపొందిస్తున్నట్టు తెలిసింది. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు జాబితా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం జాబితా ఖరారవుతుందా? వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ జాబితా ఖరారైతే అధిష్ఠానమే నేరుగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వనున్నట్టు సమాచారం.
బుధవారం హైదరాబాద్కు బయల్దేరిన రేవంత్రెడ్డిని పార్టీ పెద్దలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తి రిగి రప్పించుకున్నారు. రేవంత్రెడ్డి హఠాత్తుగా వెనుదిరగటం చర్చనీయాంశంగా మారింది. వెను దిరిగిన రేవంత్.. మాణిక్రావ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు ఆయనతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ సీనియర్లు పెట్టిన ఫిఫ్టీ-ఫిఫ్టీ డిమాండ్తోనే కంగుతిని, ఆ అంశంపై చర్చించేందుకు వెనక్కి రప్పించినట్టు సమాచారం. సీనియర్ల ప్రతిపాదనపై ఓ దశలో రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. ముందుగా ఒప్పుకొని, ఇప్పుడు షరతులు పెట్టి ఇబ్బందులు పెట్టడం ఏమిటి? అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే సీనియర్ల డిమాండ్పై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.