Congress | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన అంశంపై కాంగ్రెస్ సర్కార్ కప్పదాటుడు ధోరణి అవలంబిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి తెగేసి చెప్పలేక గత బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుల అప్పగింత కొనసాగిందని, తెలంగాణ జలహక్కులను గత సర్కార్ కాలరాసిందంటూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు.
ఇందుకు చట్టంలోని సెక్షన్ 89వ నిబంధనను ఉదహరిస్తున్నారు. అప్పటికే ఆయా రాష్ర్టాల వినియోగంలో ఉన్న నదీ జలాలను మాత్రమే ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని, బోర్డులను ఏర్పాటు చేసి, ప్రాజెక్టులు నిర్వహించాలని నిర్దేశించింది. నేడు ఆ చట్టం ప్రకారమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుల గెజిట్ను విడుదల చేసింది. ఆ చర్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నిరసించింది. ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైంది. కేంద్ర జల్శక్తి శాఖ ఇటీవల బహిర్గతం చేసిన సమావేశ మినిట్స్ ఆ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.
కేసీఆర్ కృషితోనే జలహక్కులు
కేసీఆర్ అవిశ్రాంత కృషి, కేంద్రంపై పెట్టిన ఒత్తిడి కారణంగానే నేడు తెలంగాణకు జలహక్కులు సిద్ధించాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, ఉద్యమంలో ప్రతిధ్వనించిన న్యాయమైన నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరబోదని ఖరాఖండిగా తేల్చిచెప్పడంతోపాటు ఆ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ దృష్టికి కేసీఆరే తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని 2014 జూలై14న వినతిపత్రం అందజేశారు. కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుందనే నమ్మకం కలగకపోవడంతో బీఆర్ఎస్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ట్రిబ్యునల్ అంశంపై కేసీఆర్ పట్టుబట్టారు. దీంతో కేంద్రం ఎట్టకేలకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించింది. అటు తరువాత కూడా కేంద్రం అనేక మెలికలు పెట్టినప్పటికీ గత బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడా రాజీ పడకుండా ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఫలితంగా గత అక్టోబర్లో సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో న్యాయమైన నీటి వాటా డిమాండ్లను ట్రిబ్యునల్ ఎదుట వినిపించేందుకు తెలంగాణకు అవకాశం లభించింది.