Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నది. ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.తొమ్మిదేండ్లలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ఆసరా పెన్షన్లకు రూ.68 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగతాదంతా దాచిపెట్టారని అసత్య ప్రచారం చేశారు.
వాస్తవం: సొంత పన్నుల వసూళ్లు, పెట్టుబడులు ఆకర్షించడం, రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి.. ఇలా అనేక మార్గాల్లో రాష్ట్ర రాబడిని పెంచడం, దాన్ని ప్రజలకు పంచడం సీఎం కేసీఆర్ మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి. ఉదాహరణకు.. ఆసరా పెన్షన్ల రూపంలో ఏటా రూ.12 వేల కోట్లు వేస్తుండగా, రైతుబంధు ద్వారా సుమారు రూ.15 వేల కోట్లు రైతులకు అందజేస్తున్నారు. పంట కొనుగోళ్లు, రుణమాఫీ, దళితబంధు, చేతి, కులవృత్తులకు లక్షసాయం వంటి పథకాల అమలు ద్వారా రూ.వేల కోట్లు ప్రజలకు నేరుగా అందుతున్నాయి. ఇవే కాకుండా గొర్రెల పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్తు వంటి సబ్సిడీ పథకాలతో లక్షల కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ నేతలకు కనిపించకపోవడం శోచనీయం.