వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తే సీఎం కేసీఆర్కు సన్మానం చేస్తా
2017 అసెంబ్లీలో విద్యుత్తుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి
స్పెషల్ టాస్క్ బ్యూరోహైదరాబాద్, జూలై 12, (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తే ముఖ్యమంత్రికి తానే స్వయంగా సన్మానం చేస్తానని ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్తుపై జరిగిన చర్చ సందర్భంగా సవాల్ విసిరారు. వారు అసాధ్యం అన్న దానిని సీఎం కేసీఆర్ చేతల్లో సాధ్యమేనని నిరూపించడంతో ఇప్పుడా పార్టీకి మింగుడు పడటం లేదు. ఒకనాడు అది సాధ్యమేకాదన్న ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరితే, అదే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏమో వ్యవసాయానికి అన్ని గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటున్నారు. ఒకరేమో సాధ్యం కాదంటారు. మరొకరేమో ఆ అవసరమే లేదంటారు. ఇది ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి, రైతుల పాలిట ఆ పార్టీకి ఉన్న ప్రేమ ఏపాటిదో ఇంతకంటే ఇంకేమి నిదర్శనం కావాలి.
ఉచిత విద్యుత్తు సరఫరా సాధ్యం కాదని మేము అన్నదానిని అమలు చేసి చూపించారన్న అక్కసుతో కాంగ్రెస్ నాయకులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. అంతెందుకు 2018లో గాంధీభవన్ సాక్షిగా ‘విద్యుత్తు సరఫరా-వాస్తవాలు’ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు అవసరం లేదు, తొమ్మిది గంటలు ఇస్తే చాలంటూ కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసింది. అప్పుడు కాంగ్రెస్ చెప్పిందే తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పారు. నిజానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేత అనేది కేవలం రేవంత్ అభిప్రాయం కాదనీ, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉచిత విద్యుత్తుకు ఏఐసీసీ వ్యతిరేకం
ఉచిత విద్యుత్తుకు ఇప్పుడే కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నది. 2004 ఎన్నికల సందర్భంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అప్పుడే వ్యతిరేకించింది. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని భయపడింది. ఉచిత విద్యుత్తుపై అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ వైఖరిలో మార్పేమీ లేదన్నది పలు సందర్భాల్లో వ్యక్తం అయింది. ఇప్పటికీ ఆ పార్టీ అదే వైఖరితో ఉండటం వల్లనే వరంగల్లో గత ఏడాది జరిగిన రైతు డిక్లరేషన్ సభకు హాజరైన రాహుల్ గాంధీ ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడానికి కారణం అదేనని ఆ పార్టీ వర్గాలు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.
ఈ ఏడాది చివరలో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గడ్ నాలుగు రాష్ర్టాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటిస్తే, ఇదే హామీని ఎన్నికలు జరిగే రాష్ర్టాలలోనూ ఇవ్వాల్సి వస్తుందని, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలోనూ అమలు చేయాల్సి వస్తుందని భయపడుతున్నది. వాటన్నింటికి ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించడం కంటే తెలంగాణకు ఇవ్వకుండా ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ విధానపరంగా నిర్ణయం తీసుకుందన్నది సమాచారం. అయితే ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడితే, రేవంత్రెడ్డి ఆ గుట్టు రట్టు చేయడం ఏమిటనీ కాంగ్రెస్ అధిష్ఠానం విస్తుపోయినట్టు తెలిసింది. ఇంత కీలకమైన ప్రకటనను అధిష్ఠానం చేయడం తప్ప రేవంత్ చేయడం ఏంటని పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనడంలో అంతరార్థం అదేనని చెప్తున్నారు. పార్టీ అంతర్గత విధాన నిర్ణయంపై సమాచారం ఉండటం వల్లే పార్టీ నేతలు రేవంత్రెడ్డి ప్రకటనను కక్కలేక మింగలేక సహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రైతు డిక్లరేషన్లో ఉచిత విద్యుత్తు ఎక్కడ?
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే, మరి గత ఏడాది మే 6న వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదని వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘తాము అధికారంలోకి వస్తే’.. అంటూ అనేక పనికిమాలిన హామీలు గుప్పించిన కాంగ్రెస్, ఉచిత విద్యుత్తును ప్రస్తావించడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.