నిజామాబాద్/ వేల్పూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
మంగళవారం వేల్పూరులో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి యావత్ దేశం అబ్బుర పడుతోందన్నారు. మహారాష్ట్రలోని 14 గ్రామాలకు చెందిన సర్పంచులు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు వినతి పత్రం అందించారని గుర్తు చేశారు.
చివరకు బీజేపి అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అదే పార్టీకి చెందిన రాయచూరు ఎమ్మెల్యే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. లేకపోతే తన నియోజకవర్గంను తెలంగాణ లో కలపాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
కేవలం మూడేండ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వాస్తవంగా దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, సేద్యానికి ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేకానేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు.
ఈ వాస్తవాలను బీజేపి, కాంగ్రెస్ నాయకులు గుర్తించి టీఆర్ఎస్కు బాసటగా నిలిచి తెలంగాణను ప్రగతిలో మరింతగా పరుగులు పెట్టించేందుకు దోహదపడాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.