Ravula Sridhar Reddy | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం పనితీరు బాగుందని గతంలో మోదీ అనలేదా.. మిషన్ భగీరథపై మోదీ ప్రశంసలు కురిపించలేదా? అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే బీఆర్ఎస్ నేతల ఇంటి ముందు కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం ఎట్లా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రావుల మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే బీజేపీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిందని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. దొంగలు అయితే ఎంపీ టిక్కెట్లు బీజేపీ ఎట్ల ఇస్తుందని ప్రశ్నించారు. గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారని సైదిరెడ్డికి వ్యతిరేకంగా గతంలో బీజేపీ ఆందోళనలు చేసిందని.. ఇప్పుడు ఆయనకే నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు.
కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదని రావుల అన్నారు. సికింద్రాబాద్కు ఏం చేశారని కిషన్ రెడ్డి అక్కడ గెలుస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గెలువకపోయినా ఎంపీగా నేను గెలిస్తే చాలు అని కిషన్ రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు. దళితుల భూములు ఆక్రమించుకున్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్పై విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు. కవిత అరెస్టుపై ఈటల అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. అదే ఈటలను హూజూరాబాద్లో ప్రజలు తిరస్కరించారని అన్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడికి టిక్కెట్ ఇస్తే అది కుటుంబ రాజకీయం కాదా అని బీజేపీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపూరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని బీజేపీ టికెట్ నిరాకరించిందని.. గిరిజనుడైన బాపూరావును బీజేపీ అవమానించిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలను మోసం చేస్తుందని రావుల ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. నాలుగు లిఫ్టులు ప్రారంభించడం తప్ప కిషన్ రెడ్డి చేసింది ఏం లేదని విమర్శించారు. నిజామాబాద్కు పసుపు బోర్డు ప్రకటన తప్ప ఏం రాలేదని అన్నారు.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు ఎంత వరకు అమలు అయ్యాయో రేవంత్ రెడ్డి చెప్పాలని రావుల నిలదీశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఇప్పటివరకు రైతుబంధు పడలేదని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుబంధు ఆగిందా అని ప్రశ్నించారు. వరి పంటకు ఇస్తామన్న బోనస్ ఏమైందని నిలదీశారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని మాట తప్పారని అన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. రైతుల పంటలు ఎండిపోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ కారణమని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, బీజేపీ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రావుల పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.