ఇరుపార్టీల్లో చేరికలకు కమిటీలు
కొత్త,పాత.. పొసగని కలయిక
కొండా చేరికపై స్వామిగౌడ్ గుస్సా
విజయారెడ్డిని వ్యతిరేకిస్తున్న విష్ణు
హైదరాబాద్, జూలై 6, (నమస్తే తెలంగాణ): ‘నాయకులు కావలెను’ అని కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర కమిటీలు మెడలో బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందునుంచే సమయాత్తం అయితే తప్ప వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించలేమన్న అంచనాతో బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్గాంధీ సభ నిర్వహించగా, ఉనికిని చాటుకొనేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించింది. ఈసారి కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాలవారీగా సభలు నిర్వహించాలని భావిస్తున్నది. అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎవరన్నది మొదట తేల్చుకొంటే తప్ప అధిగమించలేమని ఇరుపార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఏ వ్యూహం పన్నాలన్నా పార్టీ సంస్థాగతంగా క్షేత్రసాయిలో పటిష్ఠంగా ఉండాలి.
కమిటీలు వేసినా చేరికలు లేవు
టీఆర్ఎస్ ధాటికి కకావికలమైన ఈ పార్టీలు చేరికలపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ ఇప్పటికే కే జానారెడ్డి నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటుచేయగా, బీజేపీ కూడా ఎమ్మెల్యే ఈటల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజలకు, రాజకీయాలకు ఎప్పుడో దూరమైన నాయకులనైనా చేర్చుకోవడం ద్వారా పార్టీ పుంజుకుంటున్నదన్న భ్రమలు కల్పించడానికి కాంగ్రెస్, బీజేపీ తహతహలాడుతున్నాయి. ఈ రెండు పార్టీల్లోకి ఛోటామోటా నాయకులు తప్ప కాస్త పట్టున్న నాయకులు ఎవరూ రావట్లేదు. ఓ మున్సిపాల్టీ స్థాయి నాయకురాలిని ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పడం కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతున్నది. బీజేపీలోనూ ఇదే పరిస్థితి. రాజకీయాలకు మూడేండ్లు దూరమై గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎంపీని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరీ బతిమాలి తెచ్చుకొన్నారు. ప్రజల్లో బలం కోల్పోయిన ఇలాంటి నాయకుల వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అంతర్గత సమావేశాల్లో సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
రేవంత్, బండికి చెక్
కొత్త చేరికలతో వర్గ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఎవరి గ్రూపును వాళ్లు బలోపేతం చేసుకొనే విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఒకరి మనుషుల చేరికను ఇంకొకరు అడ్డుకొనే పరిస్థితి రెండు పార్టీల్లోనూ ఉన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓవర్ యాక్షన్లతో పార్టీలో గ్రూప్ తగాదాలు తారస్థాయికి చేరుకొన్నాయి. పార్టీపై పట్టు సాధించడానికి రేవంత్రెడ్డి బయటి నుంచి కొత్తవారిని తెచ్చుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేటర్ విజయారెడ్డి చేరిక పట్ల ఆమె సోదరుడు విష్ణువర్ధన్రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల తన ఇంటికి పార్టీ సీనియర్లను ఆహ్వానించి ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. హుస్నాబాద్లో ప్రవీణ్రెడ్డిని పార్టీలో చేర్చుకొనేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తుండగా, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడాన్ని స్వామిగౌడ్ వ్యతిరేకిస్తున్నారు. చేవెళ్ల లోక్సభ టికెట్ ఆశిస్తున్న స్వామిగౌడ్ పార్టీ నేతల పట్ల కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీలో తమ సొంతబలం పెంచుకోవడానికి రేవంత్, బండి సంజయ్ పన్నుతున్న వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. రేవంత్రెడ్డిని కట్టడి చేయడానికి పార్టీ అధినాయకత్వం ఒక దళిత నాయకుడిని ప్రోత్సహిస్తుండగా, బీజేపీలో బండి సంజయ్ని కట్టడిచేయడానికి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని అధినాయకత్వం ప్రోత్సహిస్తున్నట్టు పార్టీ వర్గాలు బాహాటంగా చెప్తున్నాయి. పార్టీలో కొత్తగా చేరే వారి కోసం పాత వారిని పణంగా పెట్టబోమని శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్కమార్క చెప్తున్నారు.
ఇమడలేకపోతున్న కొత్త నేతలు
బీజేపీలో చేరిన కొత్త నాయకులు పార్టీలో ఇమడలేకపోతున్నట్టు వాపోతున్నారు. వీరి పరిస్థితిని గమనించినవారు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. బీజేపీని వెనుక ఉండి నడిపించే ఆరెస్సెస్ నాయకులంతా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. పార్టీలో వారి పెత్తనమే నడుస్తున్నది. దీంతో కొత్తగా పార్టీలోకి రావాలనుకొనే నేతలు ఆంధ్ర నేతల కాళ్లా, వేళ్లా పడాల్సిన ఖర్మ తమకెందుకని విముఖత చూపుతున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.