Telangana | అసత్య ప్రచారం, విద్వేషం, రెచ్చగొట్టడమే ఎజెండాగా కాంగ్రెస్, బీజేపీ కుతంత్రాలకు తెరలేపుతున్నాయి. ప్రజాభిమానం, విశ్వసనీయత కలిగిన ఛానళ్లు, వెబ్సైట్లు, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఊహాజనిత కథనాలు, నిరాధార వార్తలు ప్రసారం చేస్తూ విషం చిమ్ముతున్నాయి. ప్రజారంజక పాలనను అందిస్తున్న కేసీఆర్ సర్కార్పై ఆయా మాధ్యమాల ద్వారా విషం చిమ్మి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి.
ఒకరు ఉద్వేగపూరిత మాటలతో అమాయక ప్రజలను రెచ్చగొడతారు. విద్వేషాన్ని ఎగజిమ్ముతారు. ఇంకొకరు ప్రత్యర్థి పార్టీలపై ఉన్నవి.. లేనివి కల్పించి సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున అసత్య ప్రచారం చేస్తారు. సంబంధం లేని విషయాలను అంటగడుతూ బద్నాం చేస్తారు. అక్కడితో ఆగరు… తమపై తామే దాడులు చేయించుకుంటారు. ఆపై ప్రత్యర్థి పార్టీలే తమపై అసత్య ప్రచారాలు, దాడులకు దిగాయని పెడబొబ్బలు పెడతారు. ఇలాంటి అనైతిక చర్యలకు ఒడిగట్టడం ద్వారా జనంలో సానుభూతి పొందేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తుంటారు. అయితే, ఇవన్నీ ఎంతోకాలం నుంచి ప్రజలు గమనిస్తుండడంతో విశ్వసనీయతను కోల్పోయిన నేపథ్యంలో వికృత చేష్టలకు దిగుతున్నారు.
ఎన్నిక ఏదైనా సరే ఇదీ బీజేపీ అనుసరించే.. అనుసరిస్తున్న వ్యూహం. దుబ్బాక ఉప ఎన్నిక మొదలు హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకూ కాషాయ పార్టీ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నది. ఆ ఎజెండాతోనే ఎన్నికల్లో గెలిచేందుకు అన్నిరకాల కుయుక్తులను పన్నుతున్నది. తామేమీ తక్కువ తినలేదంటూ ఇప్పుడు అదే బాటలో హస్తం పార్టీ సైతం పయనిస్తున్నది. బీజేపీని మించి సోషల్ మీడియా వేదికగా గోబెల్ ప్రచారాలకు దిగుతూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నది.
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు అనేక కుట్రలకు తెరలేపారు. ప్రభుత్వంపై ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలు అసత్య ప్రచారాలను చేశారు. బీజేపీ నేత రఘునందన్రావు బంధువు ఇంట్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడినా, అందుకు సంబంధించిన వీడియోలు ఉన్నా కాషాయ మూకలు ఆ వీడియో క్లిప్లను ఎడిటింగ్ చేసుకుని ప్రభుత్వం, పోలీసులపై బురదజల్లేందుకు యత్నించారు. చివరకు పోలింగ్ ముందురోజు సాయంత్రం కూడా కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్లో చేరుతారంటూ ఊరూరా ప్రచారం చేశారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఇటీవల జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇలాంటి వికృత ప్రచారానికి పూనుకున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై అసత్య ప్రచారాలు చేసి, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈసీకి లేఖ రాసి దళితబంధు పథకాన్ని కుట్రపూరితంగా అమలు కాకుండా అడ్డుకోవడమే కాకుండా, కావాలనే బీఆర్ఎస్ సర్కారు ఈ పథకాన్ని నిలిపేసిందనే అబద్ధ్దాన్ని ప్రచారం చేశారు. అయితే, బీజేపీ కుట్రలను గులాబీ నేతలు సాక్ష్యాలు సహా బయటపెట్టడంతో కాషాయ మూక అక్కడితో ఆ విషయాన్ని వదిలిపెట్టింది.
తమ జమానాలో చేసిన మంచి పనులేమీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై బురద జల్లేందుకు ఒడిగడుతున్నది. ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించుకునే ప్రయత్నాలేమీ చేయకుండా బీజేపీ అనుసరిస్తున్న అసత్య ప్రచారాలనే నమ్ముకున్నది. ఎన్నికల వ్యూహకర్తలను అడ్డం పెట్టుకుని, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా బీఆర్ఎస్పై అడ్డగోలుగా విషప్రచారాలకు తెరతీసింది. యూట్యూబ్ చానళ్లు, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ ఐడీలను సృష్టించి, తద్వారా నిరాధార, అభూత కల్పనలతో అసత్య ప్రచారాలకు తెగబడుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక మొదలు.. పోటీ పరీక్షలకు సంబంధించి, బీఆర్ఎస్ పథకాలపై కాంగ్రెస్ విషం చిమ్ముతున్నది. పలు సంస్థలకు డబ్బులిచ్చి తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకోవడంతో పాటు రిపోర్టులను తెప్పించుకుంటూ, వాటినే ప్రచారం చేయాలని, ప్రచారానికి సైతం డబ్బులు చెల్లిస్తామని ఆఫర్లు ఇస్తున్నదంటే ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
…? బండారు రాజు