శాలిగౌరారం/నిడమానూరు, నవంబర్ 25 : దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నిడమనూరు మండలం బంకాపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలిపారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, 70 ఏండ్ల నుంచి కానిది ఎనిమిదేండ్లలో చేసి చూపించారని తెలిపారు. విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆయన దేశానికి ఎప్పుడు నాయకత్వం వహిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. వారి పాలనలో దేశం సర్వనాశనమైనదని విమర్శించారు. తెలంగాణ తరహా పథకాల కోసం దేశ ప్రజలు డిమాండ్ చేస్తుండటంతో మోదీ సర్కార్ కేసీఆర్పై కక్షసాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చే నిధులను అడ్డుకోవడమే కాకుండా, తమ జేబు సంస్థలతో దాడులు చేయించి మానసికంగా ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్కు ఇటువంటి బెదిరింపులు పెద్ద లెక్క కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నోముల భగత్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు
శాలిగౌరారం మండలంలోని జాలోనిగూడెం, మనిమద్దె గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్లు, వల్లాల ఎంపీటీసీ, మాజీ సర్పంచ్లతోపాటు సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.