Current Bills | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది తేలకపోవడంతో.. ఆ హామీని తామే అమలు చేసుకొనే ఆలోచనలో ప్రజలున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్తు బిల్లుల మాఫీపై కాంగ్రెస్ సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వినియోగదారులే సొంత నిర్ణయం తీసుకొంటున్నారు. ఈ నెల నుంచే కరెంటు బిల్లులను కట్టబోమని తేల్చి చెప్తున్నారు.
తీవ్ర పోటాపోటీగా జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది. అసలు సాధ్యాసాధ్యాలను పరిశీలించలేదు. 2023 నవంబర్ 10న పాలకుర్తితోపాటు హైదరాబాద్లోని అమీర్పేట్, సీతాఫల్మండి చౌరస్తా తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు.. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే నెల నుంచి (డిసెంబర్) నుంచి 200 యూనిట్లలోపు విద్యుత్తు బిల్లులను కట్టవద్దని, ఆ మొత్తాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కడతారని భరోసా ఇచ్చారు. ఆ హామీలు నిజమేనని నమ్మి తాము ఓట్లేసి కాంగ్రెస్ను గెలిపించామని విద్యుత్తు వినియోగదారులు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక హామీలను గుప్పించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేయడంలో మాత్రం అంత వేగంగా పనిచేయడం లేదు. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉపయోగించుకొనే గృహ వినియోగదారుల బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తామని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఘంటాపథంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు నములుతున్నారు.
డిసెంబర్ నెల నుంచే బిల్లులు కట్టవద్దని కరాఖండిగా చెప్పిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. తాను సీఎం అయిన తర్వాత ఒకటిన్నర నెలలు గడుస్తున్నా విద్యుత్తు బిల్లులపై నోరు మెదపడం లేదు. కేవలం పథకాలను అమలు చేసేందుకే అంటూ రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 30 లక్షల దరఖాస్తులను స్వీకరించి.. వాటన్నింటినీ కంప్యూటరీకరణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. ‘డిసెంబర్ నుంచే బిల్లులు కట్టవద్దు.. మీ బిల్లులను సోనియమ్మ కడుతుందని చెప్పిన నేత మాత్రం డిసెంబర్ గడిచి.. జనవరికూడా ముగుస్తున్నా.. నోరు మెదపడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. విద్యుత్తు బిల్లులపై కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు.
విద్యుత్తు బిల్లులు తామే కడతామని హామీ ఇచ్చిన రేవంత్.. ప్రభుత్వం కొలువుదీరినా హామీని నిలబెట్టుకోకపోవడంతో.. విద్యుత్తు వినియోగదారుల్లో ఒకింత అసంతృప్తి కనిపిస్తున్నది. ‘ఇప్పటికే డిసెంబర్ నెలలో బిల్లు కట్టాం.. ఇప్పుడు జనవరి మాసంలోనూ బిల్లు కట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుంచిగానీ.. సీఎం రేవంత్నుంచిగానీ ఎలాంటి ప్రకటన రావడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తామే కరెంట్ బిల్లులు కట్టకుండా ప్రభుత్వం పరువును కాపాడతామని చురకలంటిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తున్న గృహ వినియోగదారులు సుమారు ఒక కోటి 5 లక్షల మంది వరకు ఉన్నారని తెలుస్తున్నది. ఇందులో దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో సుమారు 67 లక్షల వరకు.. ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మరో 38 లక్షల మంది వరకు వినియోగదారులున్నట్టు అంచనా. కొన్ని నెలల్లో వినియోగించే విద్యుత్తు అవసరాలను బట్టి ఇది కాస్త అటూ ఇటూగా మారుతుంది. సగటున కోటి 5 లక్షల మంది వినియోగదారులు ప్రతి నెలా సుమారు రూ. 350కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు చెల్లిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన సంవత్సరానికి సుమారు రూ. 4000 కోట్ల నుంచి రూ. 5000 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం వినియోగించుకున్న విద్యుత్తు (ఎనర్జీ) చార్జీలు మాత్రమే. అదనంగా కస్టమర్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలుకూడా ఉంటాయి. వాటినికూడా ప్రభుత్వం చెల్లిస్తుందా? లేక డిస్కంలు భరిస్తాయా? లేక వినియోగదారులు భరించాల్సి ఉంటుందా? అనేదికూడా ఇంకా తేలాల్సి ఉంది. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే.. ఇకనైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇచ్చిన హామీని అమలు చేస్తుందా? లేక విద్యుత్తు వినియోగదారులే హామీని అమలులోకి తీసుకొస్తారా? అనేది వేచి చూడాల్సిందే..!