Telangana Police | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు బదిలీల కాలం నడుస్తోంది. ‘హస్తం’ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ఉత్వర్వులు ఎప్పుడొచ్చి మీద పడతాయో, ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఒకరిద్దరు కాదు.. పదుల సంఖ్యలో అధికారులు ఇప్పుడీ పరిస్థితిని ఎదుర్కొంటుండడంతో పాలనా వ్యవస్థ కుంటుపడుతున్నది. ఏ అధికారి ఎప్పుడు వస్తాడో, ఎన్నాళ్లు ఉంటాడో తెలియక కిందిస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు ఒకరిద్దరు అధికారులు మినహా ఎవరూ కుదురుగా ఉండడం లేదు. రాష్ట్రంలో పోలీసుల బదిలీలు ప్రహసనంలా మారాయి.
సీనియర్ పోలీసు అధికారి జీ సుధీర్బాబు బదిలీల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయానికి సుధీర్బాబు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో జాయింట్ పోలీసు కమిషనర్గా ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనను రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమించింది. అక్కడే ఉన్న ఆయనను ఈ నెలలో హఠాత్తుగా బదిలీ చేసి మల్టీజోన్-1కు ఐజీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మళ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు.
మరో సీనియర్ అధికారి ఏవీ రంగనాథ్ ఎన్నికల సమయంలో వరంగల్ పోలీసు కమిషనర్గా ఉండేవారు. నవంబర్లో ఆయనను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. రిజర్వ్లో ఉన్న ఆయనను హైదరాబాద్ సిటీ క్రైంకు జాయింట్ పోలీసు కమిషనర్గా బదిలీ చేశారు. తాజాగా మల్టీజోన్-1కు ఐజీగా బదిలీ చేశారు. అంటే గడిచిన నాలుగు నెలల్లో ఆయనను నాలుగుసార్లు బదిలీ చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి విశ్వప్రసాద్ డిసెంబర్ నాటికి హైదరాబాద్లో స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీగా ఉండేవారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఆయనను హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీగా నియమించింది. తాజాగా ఇప్పుడు పోలీసు ఆర్గనైజేషన్స్కు బదిలీ చేసింది. మూడు నెలల్లో ఆయన మూడు బాధ్యతల్లో పనిచేశారు.
ఐఏఎస్ అధికారి శరత్చంద్రపవార్ ఎన్నికలకు ముందువరకు మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనను నగరంలోని సెంట్రల్ డీసీపీగా వేశారు. అక్కడ ఉన్న ఆయనను ఇప్పుడు నార్కోటిక్ బ్యూరోకు ఎస్పీగా మార్చారు.
నాన్క్యాడర్ ఎస్పీగా ఉన్న సాయిశ్రీ డిసెంబర్లో ఎల్బీనగర్ డీసీపీగా ఉండేవారు. ఆ తర్వాత ఆమెను ఈస్ట్జోన్ డీసీపీగా మార్చారు. తాజాగా ఆమెను సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా వేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరో అరడజను మంది ఇలా బదిలీ అయినవాళ్లున్నారు. ఐపీఎస్ అధికారి ఎల్ఎస్ చౌహాన్ను రామగుండం సీపీగా వేశారు. ఆయన అక్కడకు వెళ్లి బాధ్యతలు తీసుకోకముందే అక్కడి నుంచి మార్చి జోగులాంబ గద్వాలకు మార్చారు.
ఎక్కడైనా ఒక అధికారి బదిలీ అయి కొత్త పోస్టులో చేరితే అక్కడి నుంచి వెంటనే బదిలీ చేయడం అనేది దాదాపుగా ఉండదు. కానీ, పోలీసు శాఖలో మాత్రం చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో పనిచేస్తున్న ఆదినారాయణను పాల్వంచ డీఎస్పీగా బదిలీ చేశారు. అక్కడికి వెళ్లి ఎస్పీకి రిపోర్టు చేసి విధుల్లో చేరారు. చేరిన ఒక్క రోజు వ్యవధిలోనే బదిలీ అంటూ మరో ఉత్తర్వు వచ్చింది. ప్రశాంత్రెడ్డి అనే మరో డీఎస్పీ నెలలోనే అత్యధికంగా నాలుగు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. చేవెళ్ల-ఐటీ సెల్-కాచిగూడ- సైబర్సెక్యూరిటీ.. ఇలా ఆయనకు ఉత్తర్వులపై ఉత్తర్వులు వచ్చాయి. సామాల వెంకట్రెడ్డి అనే మరో డీఎస్పీ పరిస్థితి కూడా ఇంతే.. మేడ్చల్-సుల్తాన్బజార్-బంజారాహిల్స్కు వరుస బదిలీలు జరిగాయి. కేవీ సూర్యప్రకాశ్రావు అనే డీఎస్పీ కూడా నెలలో మూడు పోస్టింగ్లు చూశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పదుల సంఖ్యలో డీఎస్పీస్థాయి అధికారులున్నారు.