హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల్లో ఉన్న నీటి లభ్యతను కచ్చితమైన లెక్కలతో నిర్ధారించిన తరువాతే, నదుల అనుసంధానంపై ముందుకుపోవాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సూచించింది. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నదుల అనుసంధానంపై చర్చించారు. ఇందులో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల అధికారులు పాల్గొన్నారు. గోదావరి-కావేరి రివర్ లింక్ డీపీఆర్పై అన్ని రాష్ర్టాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం తన వాదనలను స్పష్టంగా తెలియజేసింది. గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టులో 50 శాతం ప్రయోజనం తెలంగాణకు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, అంతర్రాష్ట్ర జలమండలి సీఈ మోహన్కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.