హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: ఉద్యోగార్థులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న గ్రూప్-1 కొలువుల పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. ఒత్తిడి, భయం, అపోహలను వీడి పక్కాప్రణాళికతో సిద్ధమైతే కొలువును సాధించడం సులువేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిసమయంలో అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అంశాలు, పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలపై నిపుణుల సలహాలు, సూచనలతో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ..
చేయాల్సిన పనులు
* ప్రతి రెండు లేదా రెండున్నర గంటలకు సుదీర్ఘ విరామం, అరగంట లేదా గంటకోసారి స్పల్ప విరామం తీసుకోవాలి.
8 గంటలు తప్పక నిద్రకు కేటాయించాలి.
* ధ్యానం, వ్యాయామంతో ఏకాగ్రత పెరగడంతోపాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
* చదివిన అంశాలను, కాన్సెప్ట్లను ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుందన్నది గుర్తుపెట్టుకొనేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
* ముఖ్యమైన పాయింట్లు, రాసుకొన్న నోట్స్ రివిజన్ చేసుకోవాలి.
చేయకూడని పనులు
* సోషల్ మీడియా, టీవీ, స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలి.
* ఏ పుస్తకాలు చదువుతున్నావు, ఎంత సమయం చదువుతున్నావు, ఎంతసేపు రివిజన్ చేస్తున్నావంటూ స్నేహితులను అడగొద్దు. అతను చెప్పే సమాధానాలు మన ఏకాగ్రతను దెబ్బతీయొచ్చు.
* చివరి నిమిషంలో టైంటేబుల్ను మార్చొద్దు. రోజుకు 8 గంటలు చదివితే అదే పంథాను కొనసాగించండి.
* స్పైసీ, జంక్ఫుడ్, పిజ్జాలు, బర్గర్ల జోలికివెళ్లొద్దు.
* పార్టీలు, ఫంక్షన్లు వంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.
పాజిటివ్గా ఆలోచించాలి
ప్రతికూల ఆలోచనలను అధిగమించకపోతే పరీక్షల్లో విజయం సాధించడం చాలా కష్టం. పరీక్షలు సమర్థంగా రాయాలనుకొనే అభ్యర్థులు పాజిటివ్గా ఆలోచించాలి. మంచి అనుభూతితో పరీక్షకు హాజరవ్వాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా పరీక్షను బాగా రాయగలుగుతారు. ప్రిపరేషన్ సమయంలో అప్పుడప్పుడూ విరామాలు తీసుకోవాలి. ఆహ్లాదకర వాతావరణంలో నడవడం వంటివి చేయాలి. ఒత్తిడికి గురిచేసే వ్యక్తులకు కొద్దిరోజులు దూరంగా ఉండటం మంచిది. మొత్తం మీద పరీక్షను బాగా రాయగలం అనే సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. – డాక్టర్ కవిత చెంగాల గౌతవరమ్, పాజిటివ్ సైకాలజిస్ట్
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
అభ్యర్థులు పోటీ గురించి పట్టించుకోకుండా పరీక్షలో రాణించడంపైనే దృష్టిపెట్టాలి. పరీక్షా కేంద్రంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో ఉండాలి. సరైన నిద్ర, ఆహారం ఎంతో అవసరం. ఇవి ఎక్కువైనా, తక్కువైనా ఒత్తిడి పెరిగి ఏకాగ్రత లోపిస్తుంది. గతంలో ఉద్యోగం పొందినవారు చెప్పినట్టుగా రోజూ 15, 16 గంటలు కాకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని చదవాలి. ఫలితం కోసం ఆశించవద్దు. గతంలో విజయం సాధించిన వారినుంచి స్ఫూర్తిని పొందాలి. – డాక్టర్ రాధిక, సైకాలజిస్ట్
చదవడం మానసిక ఒత్తిడి కాదు
8% మంది భారతీయులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టుగా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చదవడం మానసిక ఒత్తిడి కిందికి రాదు. కానీ, చదువు గురించి ఆలోచించడం, ఎలా చదవాలన్నది మాత్రం మానసిక ఒత్తిడే అవుతుంది. మనిషి ప్రవర్తనను బట్టి ఆలోచనలు మారుతాయి. ఇతరులతో మనను పోల్చుకోవద్దు. మన తెలివితేటలపై మాత్రమే ఆధారపడాలి. ప్రశ్నల ఛేదనలో సమాధానం తెలియనప్పుడు కోపం, అసహనం ఆవహిస్తుంది. దీంతో మనపై మనకే అపనమ్మకం ఏర్పడుతుంది. తెలిసిన వాటికి ఆన్సర్లు చేయడం, తెలియని వాటిని ఊహించి ఆన్సర్లు చేసే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. – పీ జవహర్లాల్ నెహ్రూ, సైకాలజిస్ట్
పరీక్ష రోజు ప్రశాంతత ముఖ్యం
పోటీ పరీక్షల్లో తక్కువ తప్పులు చేసేవారే ఎక్కువ స్కోర్ చేయగలరు. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు, చదివిన దానిని ఎంత మేరకు ఆకళింపు చేసుకున్నామన్నదే కీలకం. ప్రశ్నలను చూసి కంగారుపడొద్దు. మనం ప్రశాంతంగా ఉంటే ఆన్సర్లు వాటంతటవే గుర్తుకువస్తాయి. ఇక ప్రశ్నలు చదవగానే వెంటనే ఆప్షన్లు చూడొద్దు. ఆయా ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే అది ప్రశ్నపత్రంలో ఉందో లేదో చూసుకోవాలి. ముందే ఆప్షన్స్పై ఆధారపడితే దగ్గరి సంబంధమున్న ఆప్షన్లతో సందిగ్ధతకి దారితీస్తుంది.
– ముద్దసాని శ్రీనివాస్, సైకాలజిస్ట్