ఈవోడీబీలో అగ్రస్థానంపై శుభాకాంక్షలు: సుచిత్రా ఎల్లా
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సులభతర వాణిజ్య విధానంలో అగ్రభాగాన నిలవడం పట్ల తెలంగాణకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఐఐ దక్షిణ భారత విభాగం అధ్యక్షురాలు సుచిత్రా ఎల్లా, సీఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు వాగిశ్ దీక్షిత్ ఒక ప్రకటన విడుదల చేశారు.
2025 నాటికి దక్షిణ భారతదేశం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారటానికి అన్ని అవకాశాలను కలిగి ఉన్నదని సుచిత్రా ఎల్లా తెలిపారు. ఈవోడీబీలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ సహా మరో మూడు రాష్ర్టాలు టాప్ ఆచీవర్స్గా నిలవటం.. ఇక్కడ మెరుగైన వ్యాపార అవకాశాలు ఉన్నాయనటానికి నిదర్శనమని వెల్లడించారు. ఈవోడీబీలో టాప్ ఆచీవర్స్ రాష్ర్టాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈవోడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినందుకు ప్రభుత్వానికి వాగిశ్ దీక్షిత్ అభినందనలు తెలిపారు. ఈవోడీబీలో అగ్రస్థానం సాధించటంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వెల్లడించారు.