Bus Conductor | కోస్గి/తాండూరు, డిసెంబర్ 24: మహబూబ్నగర్-తాండూర్ రూట్లో నడిచే తాండూర్ డిపో బస్సులో మహిళలు లేకున్నా.. కండక్టర్ వారి పేరిట టికెట్లను జారీ చేసి వాటిని కిటికీలో నుంచి బయటకు పారేశారు. ఈ ఘటనపై ‘బస్సులో కండక్టర్ చేతివాటం’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం సల్కర్పేట్, జనుంపల్లి గ్రామాల యువకులు కండక్టర్ బస్సులో నుంచి పారేసిన టికెట్లను గుర్తించారు. సల్కర్పేట్ శివారులో 16 టికెట్లు, జనుంపల్లి శివారులో 45 టికెట్ల కట్టలను సేకరించారు. ఇందులో గండీడ్ నుంచి సల్కర్పేట్ వరకు ఇచ్చిన టికెట్లే ఎక్కువగా ఉన్నాయని, ఈ నిర్వాకానికి పాల్పడిన సదరు కండక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. తాండూరు డిపోకు చెందిన బస్సు(టీఎస్ 34, టీఏ 5189) కండక్టర్ కే శ్రీనివాస్.. బస్సులో మహిళలు ఎక్కకున్నా టికెట్లు ప్రింట్ చేసి మహిళా ప్రయాణికులు ఎక్కినట్టు చూపించడంపై తమకు వీడియోతో కూడిన ఆధారాలు చేరాయని, ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి విచారణ అనంతరం సదరు కండక్టర్పై చర్యలు తీసుకుంటామని తాండూరు ఆర్టీసీ డీఎం పేర్కొన్నారు.