హైదరాబాద్, ఆగస్టు23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగ నియామక పరీక్షలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. మొత్తం 4,93,727 (75.68%) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ మల్లయ్యభట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో మొత్తం తొమ్మిది క్యాటగిరీల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జేఎల్, డీఎల్, పీడీ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ పీడీ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం 9,210 పోస్టుల నియామక బాధ్యతలను తెలంగాణ ట్రిబ్కు అప్పగించింది. ఈ మొత్తం పోస్టులకు 6,52,413 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 104 కేంద్రాల్లో ఈ నెల 1 నుంచి 23 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బందికి మల్లయ్య భట్టు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.