హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ఫోన్లతో అనుమతించొద్దని సూచించారు. వచ్చే నెల 10 నుంచి జూన్ 1 వరకు జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం మంత్రి సబిత హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమీక్షించారు.
పరీక్షాకేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అన్ని రకాల ఏ ర్పాట్లపై ఉన్నతాధికారులు పరీక్షా కేంద్రాలను ముందే తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. నిరుడు ఎంసెట్ పరీక్షకు 2,66,719 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 3,18,018 దరఖాస్తులొచ్చాయని, ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరీక్షల నిర్వహణపై ఎక్కడా రాజీపడొద్దని, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు పాటించే జాగ్రత్తలను హాల్టికెట్లపై ముద్రించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.