అమరావతి : విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ (Rajiv Ratan) మరణం పట్ల పోలీస్ అధికారులు (Police Officers) సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం ఏఐజీ ఆసుపత్రి లో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్(IPS) అధికారులు ఆసుపత్రికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
రాష్ట్ర డీజీపీ రవి గుప్తా (DGP Ravi Gupta) , ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి .శివధర్ రెడ్డి, రైల్వేలు, రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, తరుణ్ జోషి తదితరులు రాజీవ్ రతన్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
బుధవారం మధ్యాహ్నం షేక్పేట(\Shaikpeta) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ కరీంనగర్ జిల్లా ఎస్పీ గా, హైదరాబాద్ రీజియన్ ఐజీగాను , అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. డీజీపీ కార్యాలయంలో ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ గాను, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గాను పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. వచ్చే అక్టోబర్ నెలలో ఆయన ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది.