హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో దక్షిణాది రాష్ట్రాలు గ్రామాలకు ఎక్కువ మొత్తంలో నిధులను బదలాయిస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు అశోక్ లాహిరి చెప్పారు. దక్షిణాది రాష్ర్టాలను చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే గ్రామ పంచాయతీలకు నిధులు, అధికారాలు, సమర్థ యంత్రాంగం ఉంటే అవి మరింత బలోపేతం అవుతాయని అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో ఏర్పాటుచేసిన రెండు రోజుల రాష్ట్ర ఆర్థిక సంఘాల జాతీయ స్థాయి సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దేశంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ర్టాలు ఎక్కువ మొత్తంలో స్థానిక సంస్థలకు నిధులు బదిలీ చేయడం లేదన్నారు. గ్రామపంచాయతీలు సమర్థంగా సేవలు అందించేందుకు అంతర్గత ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారని, ప్రజలు కూడా గ్రామ సభల ద్వారా భాగస్వామ్యం అవుతారని చెప్పారు. కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్కుమార్ మాట్లాడుతూ.. గ్రా మ పంచాయతీల నిధులను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఆడిట్ నివేదికలను ప్రతి గ్రామ సభల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో కేంద్ర పంచాయతీరాజ్శాఖ అదనపు కార్యదర్శి సీ చంద్రశేఖర్కుమార్, ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్రకుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మాజీ కార్యదర్శి విజయానంద్, ఎన్ఐఆర్డీ అసోసియేట్ ప్రొఫెసర్లు అంజన్కుమార్, చిన్నాదురై, రాజేశ్ కుమార్సిన్హా, తెలంగాణ నుంచి ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ రాజేశంగౌడ్, మాజీ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా తదితరులు పాల్గొన్నారు.