దిలావర్పూర్, డిసెంబర్ 27: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలంటూ బుధవారం మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గుండంపల్లి గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక్కరు చొప్పున తరలివచ్చి జాతీయ రహదారి-61పై బైఠాయించారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమపై ఇథనాల్ పరిశ్రమ కుంపటి పెట్టిందని మండిపడ్డారు. పంట భూములు బీడుగా మారుతాయని ఆవేదన చెందారు. పంట భూములు దెబ్బతింటాయని, కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నిర్మల్ పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసిల్దార్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.