పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula) అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సాధించిన ప్రగతిని నలుదిక్కులా చాటేలా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది వేడుకలపై ఆదివారం పెద్ద పల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
జూన్ 2 నుంచి నిర్వహించనున్న ఉత్సవాలకు ముందస్తుగా ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దశాబ్ది వేడుకల్లో(Decade Celebrations) వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం, విద్యా, మిషన్ భగీరథ తదితర ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించామని వెల్లడించారు.
నీటి పారుదల(Irrigations) రంగంలో సాధించిన ప్రగతికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు. పంజాబ్ కు ధీటుగా నేడు తెలంగాణలో వరి సాగు జరుగుతుందని వివరించారు. గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలలో అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు.
కల్యాణలక్ష్మి(Kalyana laxmi), షాదీ ముబారక్,ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు అందజేత వల్ల జరుగుతున్న మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.