యుద్ధప్రాతిపదికన చెక్డ్యామ్లు పూర్తి చేయాలి : మంత్రి హరీశ్రావు
మెదక్/మెదక్ అర్బన్, జూన్ 6: అక్కన్నపేట్ నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటికి రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సంబంధిత అధికారు లకు సూచించారు. రైల్వేలైన్ పనులు చివరి దశలో ఉన్నాయని, మరో రూ.25 కోట్లు అవసరమని రైల్వే డివిజనల్ ఇంజినీర్ సధర్మ తెలుపగా, వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని హరీశ్రావు చెప్పారు. మెదక్ పట్టణంలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, రూ.1.35 కోట్లతో జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ ల్యాబ్ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవెన్యూ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రైల్వేలైన్ నిర్మాణానికి మార్చిలో రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వేకు ఇచ్చామని, మరో రూ.25 కోట్లను వెం టనే మంజూరు చేస్తామని చెప్పారు. పనులను వేగంగా పూర్తిచేసి దసరా నాటికి రైల్వేస్టేషన్ ప్రారంభించేలా చూడాలని కోరారు. ఘనపురం ప్రాజెక్ట్ ఆనకట్ట 1.75 మీటర్ల ఎత్తు పెంపులో భాగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసేందుకు మరో రూ.8 కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణకు కాలువలు, సిమెంట్ లైనింగ్ కోసం రూ. 25కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని చెప్పారు. హల్దీ ప్రాజెక్టు మీద ఆరు చెక్డ్యామ్లు, మంజీరా మీద 9 చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు 7 పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.