హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్లో పూర్తి మార్కులు కేటాయించ నున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పాస్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పద్ధతిద్వారా విద్యార్థులందరికీ మార్కులు వేయాలని ఇంటర్బోర్డును ఆదేశిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జీవో-100ను విడుదల చేశారు. 2020-21 సంవత్సరానికి కొవిడ్-19 దృష్ట్యా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దుచేయడంతో పాటు, వారికి ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా మార్కులేసేలా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఫస్టియర్ విద్యార్థులందరినీ సెకండియర్లోకి ప్రమోట్చేయాలని జీవోలో సూచించారు. ఇంటర్బోర్డు నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలను సమర్పించనుంది.
ఇదీ విధానం..
అబ్జెక్టివ్ క్రైటీరియా ప్రకారం నిర్ధారించిన అంశాలవారీగా విద్యార్థులకు మార్కులేస్తారు. ఆయా మార్కులన్నింటిని కూడి విద్యార్థి సాధించిన మొత్తం మార్కులుగా పరిగణిస్తారు.
ఆ మార్కులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) చేత టెస్ట్ చేయిస్తారు.
సీజీజీ టెస్ట్చేసిన మార్కుల జాబితాను ఇంటర్బోర్డు తుది పరిశీలన జరిపి ఖరారుచేస్తుంది.
ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాత ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఇందుకు మూడు నాలుగు రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఫస్టియర్లో విద్యార్థులు సాధించిన మార్కులతోపాటు, సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్లో ఫుల్ మార్కులు వేయనున్నారు. మరికొన్ని అంశాలను కూడా అబ్జెక్టివ్ క్రైటీరియాలో పరిశీలిస్తున్నారు.