హైదరాబాద్, సెప్టెంబర్22 (నమస్తే తెలంగాణ): న్యాయపరమైన వివాదాలు తొలగిపోయిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జలసంఘానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తిచేసింది. ఇప్పటికి ప్రాజెక్టుకు ఆరు అనుమతులు వచ్చాయని, మిగిలినవి వెంటనే మంజూరు చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ)రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం ఓ లేఖ రాశారు. బ్రిజేష్కుమా ర్ ట్రిబ్యునల్ ఎదుట పాలమూరు ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో డీపీఆర్ను పరిశీలించలేమని గతంలో సీడబ్ల్యూసీ వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ ఇటీవలనే కొట్టివేసిందని, ఈ నేపథ్యంలో వెంటనే డీపీఆర్ పరిశీలనను పునఃప్రారంభించాలని కోరారు.
ఇన్బేసిన్ ప్రాజెక్టులన్నీ తెలంగాణవే
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు ద్వారా కృష్ణా నదిలో లభించే మొత్తం 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రిబ్యునల్ 45 టీఎంసీలను కేటాయించిందని, ఆ జలాలను నాగార్జునసాగర్ ఎగువన, కేవలం ఇన్బేసిన్ ప్రాజెక్టులకు మాత్ర మే వినియోగించాలనే నిబంధన కూడా ఉన్నదని తెలంగాణ వివరించింది. ఈ నేపథ్యంలోనే సదరు 45 టీఎంసీల జలాలను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)కి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేటాయించిందని, ఆ మేరకు 1986లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ డీపీఆర్ని సీడబ్ల్యూసీకి సైతం సమర్పించిందని వివరించింది.
అయితే పోలవరం టీఏసీ అనుమతులు పొందిన అనంతరం డీపీఆర్ను సమర్పించాలని సూచిస్తూ నాడు సీడబ్ల్యూసీ ఆ డీపీఆర్ను తిప్పిపంపిందని తెలిపింది. పోలవరంకు 2009లో టీఏసీ అనుమతులు లభించాయని, 2014లో కేంద్రం దానిని జాతీయ ప్రాజెక్టుగా కూడా ప్రకటించిందని తెలిపింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను సాగర్ ఎగువన ఇన్బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించాలని ఉమ్మడి ఏపీ రాష్ట్ర స్థాయి సాంకేతిక సలహా కమిటీ కూడా 2013లో సిఫారసు చేసిందని గుర్తుచేసింది. 2014లో ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన ప్రస్తుత ఏపీకి ఎలాంటి ఇన్బేసిన్ ప్రాజెక్టులు లేవని నొక్కిచెప్పింది. ప్రస్తుతం సాగర్ ఎగువన ఉన్న ఇన్బేసిన్ ప్రాజెక్టులన్నీ తెలంగాణకు చెందినవేనని, అందులో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఒకటని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు ఆ 45 టీఎంసీలను కేటాయించిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను పునఃప్రారంభించాలని, అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేయాలని సీడబ్ల్యూసీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసింది.