హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్పై చేపట్టిన పలు మరమ్మతు పనులపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో కేఆర్ఎంబీ అధికారులు గురువారం ఆ మరమ్మతు పనులను పరిశీలించనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం, శ్రీశైలం డ్యామ్ నిర్వహణను ఏపీ సర్కారు చూడాల్సి ఉన్నది.
రాష్ట్ర పునర్విభజన నాటి నుంచే ఈ విధానం కొనసాగుతున్నది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో రూ.20 కోట్లతో సాగర్ డ్యామ్కు పలు మరమ్మతులు చేపట్టింది. ప్రధానంగా గేట్ల రబ్బర్సీల్స్ను మార్చడం, గ్రీజింగ్, రోప్ల మార్పిడితోపాటు, గ్యాంట్రీ పట్టాల మార్పిడి, గ్యాలరీ తదితర పనులను నిర్వహిస్తున్నది. ఈ పనులు కొనసాగుతుండగానే ఏపీలోని జగన్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందురోజు సాయుధబలగాలతో తరలివచ్చి డ్యామ్ను కుడివైపు 13వ గేట్వరకు, కుడికాలువ రెగ్యులేటర్ను ఆక్రమించడం..
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాగర్ డ్యామ్ను కేఆర్ఎంబీ తన ఆధీనంలోకి తీసుకున్నది. అంతేకాకుండా డ్యామ్కు ఎలాంటి మరమ్మతులు చేపట్టాలన్నా, ఇరు రాష్ర్టాల అధికారులను డ్యామ్ వద్దకు అనుమతించాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరని, అనుమతులు ఉంటేనే అధికారులను అనుమతించాలని సీఆర్ఫీఎఫ్కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డ్యామ్ మరమ్మతు పనులకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేఆర్ఎంబీని కోరింది. అందుకు బోర్డు అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ మరమ్మతు పనులను పునఃప్రారంభించింది. ఏపీ వైపున కూడా మరమ్మతు పనులను చేపట్టింది. అయితే ఆ పనులపై తాజాగా ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆ పనులను ఎందుకు చేస్తున్నారు? అవి అత్యవసరమైన పనులా? కావా? అని ప్రశ్నిస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఏపీ అభ్యంతరాల నేపథ్యంలో డ్యామ్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు బోర్డు సిద్ధమైంది. అందుకోసం ఇద్దరు అధికారులను నియమించింది. వారు గురువారం డ్యామ్ను సందర్శించనున్నారు.