హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : కోకాపేటలోని నియోపొలిస్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి మైనింగ్ అండ్ మినరల్స్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు వెళ్లింది. జీవో-261 ప్రకారం ఉస్మాన్సాగర్ క్యాచ్మెంట్ పరిధిలోని 560 ఎకరాలకుపైగా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఆ భూమిలోనే భాగ్యలక్ష్మి క్రషర్స్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని మానవహక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదనే నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారం క్రషింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారీ ఎత్తున క్రషింగ్ పనులు చేపడుతుండటంతో పరిసర ప్రాంతాలతోపాటు కోకాపేట గ్రామం కాలుష్యం బారిన పడుతున్నదని తెలిపారు. భాగ్యలక్ష్మి క్రషర్స్పై తక్షణమే చర్యలు తీసుకునేలా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ను ఆదేశించాలని మానవ హక్కుల కమిషన్ను కోరారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం 2007లో జారీ చేసిన జీవో-261 ప్రకారం జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ క్యాచ్మెంట్ పరిధిలో 10 కిలోమీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలూ, వ్యాపార కార్యకలాపాలు చేపట్టకూడదు. కోకాపేట పరిధిలోని నియోపొలిస్ ప్రాంతంలో సర్వే నంబర్ 239లో 218.11 ఎకరాలు, సర్వే నంబర్ 240లో 316 ఎకరాల భూములు క్యాచ్మెంట్ ఏరియాలోని నిషేధిత ప్రాంతంలో ఉన్నాయని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్లో క్రషింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జీవో-261ను సవరించేందుకు వీలులేదు కాబట్టి, నియోపొలిస్ ప్రాంతంలో క్రషర్ నిర్వహించడం నేరమని పేర్కొన్నారు. నిషేధిత భూముల్లో క్రషింగ్ పనులు చేస్తూ పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ భాగ్యలక్ష్మి క్రషింగ్ కంపెనీ సీఎం సంబంధీకులదని ఇటీవల ప్రచారం జరుగుతున్నదని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా చూసీచూడనట్టు వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే నవీన్యాదవ్ కూడా నియోపొలిస్ ప్రాంతానికి వచ్చి.. ఆ భూములను తామే విక్రయించామని, అక్కడ క్రషింగ్ చేసిన రాళ్లను చుట్టుపక్కల ఉన్న భవనాల నిర్మాణానికే వాడుతున్నట్టు చెప్పారని గుర్తు చేశారు.