హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి భద్రత విషయంలో కూడా రాజీ లేకుండా చర్యలు చేపడుతున్నది. వారి రక్షణ కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా ఇస్తున్నది. అతివలను వేధిస్తున్న మృగాళ్లు, ఆకతాయిల ఆటకట్టిస్తూ వారిని కటకటాల్లోకి పంపిస్తున్నది. మహిళల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో మహిళా పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేకించి ఉమెన్ రిసెప్షన్ సెల్ను ఏర్పాటు చేయడంతో బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. షీటీమ్లు 24 గంటలూ నిఘా ఉంచడంతో వేధింపుల కేసులు తగ్గిపోతున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా పురుడుపోసుకొన్న షీటీమ్స్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చక్కటి సేవలందిస్తున్నాయి. మఫ్టీలో ఉంటూ, రహస్య కెమెరాలతో ఆగడాలు చిత్రీకరిస్తూ..స్పాట్లోనే ఆకతాయిలను అరెస్టుచేసి జైలుకు పంపుతున్నాయి. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 6,157 ఫిర్యాదులు స్వీకరించిన షీటీమ్స్.. 2,128 ఎఫ్ఐర్లు, 864 మందిపై కేసులు నమోదు చేసింది. 1,842 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి, 1323 మందికి గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వాట్సాప్, డయల్ 100, హాక్ఐ, ఈ-మెయిల్, సోషల్ మీడియా, క్యూఆర్ కోడ్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
మహిళలను వేధించినా, దాడులకు పాల్పడినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. 2022లో 59 కేసుల్లో 70 మందికి కోర్టులు జీవిత ఖైదు విధించాయి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకొంటున్నారు. 2022లో 342 కేసుల్లో 645 మందిని కాపాడిన పోలీసులు 491 మంది అక్రమ రవాణాదారులను అరెస్టు చే సి, 37 మందిపై పీడీయాక్టును నమోదు చేశా రు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పేరుతో చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేస్తున్నా రు. ఆన్లైన్లో వేధిస్తున్న ఆకతాయిలకు ‘షీ సైబర్ ల్యాబ్’ ముకుతాడు వేస్తున్నది. గృహహింస బాధితులకు ‘ధైర్య’ యాప్ ద్వారా అండగా నిలుస్తున్నది. అంతేకాకుండా హైస్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నేరాల నివారణకు శిక్షణ ఇవ్వడంతోపాటు షార్ట్ఫిల్మ్లు, యాడ్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా భద్రతా చర్యలను వివరిస్తున్నారు.
లైంగిక వేధింపుల బాధితులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రభుత్వం 2016లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, మహబూబాబాద్లో ఇప్పటికే భరోసా కేంద్రాలుండగా, ఇటీవల యాదాద్రి భువనగిరి, శంషాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా బాధిత మహిళలకు న్యాయ, వైద్య, రక్షణ, పరిహారం వంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తారు.