ఎయిమ్స్ డైరెక్టర్ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవనం ఇది. సంస్థ మొత్తం పాలన ఇక్కడి నుంచే జరగాలి. కానీ.. ఇప్పటికీ పిల్లర్ల దశ దాటలేదు. డైరెక్టర్ భవనమే ఇలా ఉంటే.. ఇక మిగతా నిర్మాణాల సంగతి ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవచ్చు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)/బీబీనగర్: ‘ఉన్నది చెంచెడు.. చెప్పేది చెంబెడు’.. ఈ సామెత బీబీనగర్ ఎయిమ్స్కు అచ్చంగా సరిపోతుంది. వైద్యరంగంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటవుతున్నదంటే మెరుగైన వసతులతో, అద్భుతమైన వైద్యసేవలు అందుతాయని అటు ప్రజలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేరుకే పెద్దాసుపత్రి అయినా.. పీహెచ్సీకి మించి సేవలు అందించలేకపోతున్నది. బీబీనగర్ ఎయిమ్స్కు 2018 డిసెంబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లతో అత్యాధునిక వసతులతో దవాఖానను నిర్మిస్తామని డబ్బా కొట్టుకున్నది. ఐదేండ్లు గడుస్తున్నా కనీసం ఒక్క భవనం కూడా మొదటి అంతస్తు వరకు పూర్తి కాలేదు. మొత్తం నిర్మాణాల్లో 5 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లోనే తాత్కాలికంగా కళాశాల, వైద్యశాల నడుస్తున్నాయి.
పిల్లర్లు దాటని నిర్మాణాలు..
బీబీనగర్ ఎయిమ్స్ను 2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని మొదట్లో కేంద్రం ప్రకటించింది. కానీ.. 2022 జూలై వరకు పనులు కూడా మొదలుపెట్టలేదు. ఇప్పుడు నిర్మాణాల గడువును 2024 జూలైకి పొడిగించింది. రూ.1,028 కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటివరకు విడుదల చేసిన నిధులు ఎంతో ఊహించగలరా? కేవలం రూ.53 కోట్లు. ఈ ప్రాంతంలో ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారో అంచనా వేయగలరా? 400కు మించి లేరు. అందుకే ఇప్పటివరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ప్రతి ఐదు పోస్టుల్లో మూడు ఖాళీ
ఎయిమ్స్ను పేరుకే మంజూరు చేశామే తప్ప.. కనీస వసతుల కల్పనపై దృష్టిపెట్టడం లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోక్సభలో ఒప్పుకొన్నది. బీబీనగర్ ఎయిమ్స్కు మొత్తం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి 1,154 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 62 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇటీవల వెల్లడించింది. అంటే ప్రతి ఐదు పోస్టుల్లో మూడు ఖాళీగా ఉన్నాయి. విభాగాలవారీగా చూస్తే.. టీచింగ్ స్టాఫ్లో 45 శాతం, నాన్ టీచింగ్ స్టాఫ్లో 65 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఓపీకే పరిమితం
ప్రస్తుతం ఉన్న భవనంలో కనీసం ఒక్క మంచి ఆపరేషన్ థియేటర్ లేదు. చిన్నచిన్న యంత్రాలు తప్ప.. పెద్ద సర్జరీలు చేసేందుకు అనువైన పరికరాలు లేవు. దీంతో ప్రస్తుతం ఎయిమ్స్ ఓపీకే పరిమితమైంది. రోజుకు దాదాపు 500 మంది ఓపీకి వస్తున్నారు. వారికి మందులు ఇచ్చి పంపుతున్నారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరం అయితే నిమ్స్ లేదా గాంధీ దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. దీంతో ఇన్పేషెంట్ల సంఖ్య రోజుకు 30కి దాటడం లేదు.
అన్యాయమవుతున్న వైద్య విద్యార్థులు
బీబీనగర్ ఎయిమ్స్లో 2019-20 నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకు కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నది. తరగతుల నిర్వహణకు అన్నిరకాల వసతులు కల్పించడంతోపాటు, సవాలక్ష నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయినా.. బీజేపీయేతర రాష్ర్టాల్లో ఏదో ఒక చిన్న కారణం అడ్డుపెట్టి అనుమతి రాకుండా అడ్డుకొంటున్నది. కానీ బీబీనగర్ ఎయిమ్స్లో తరగతులు నిర్వహించేందుకు అనువైన వసతులు లేకున్నా.. 2019-20 నుంచి ఎంబీబీఎస్ బ్యాచ్ మొదలు పెట్టింది.
ప్రస్తుతం మూడు బ్యాచ్ల విద్యార్థులు 260 మంది వరకు చదువుతున్నారు. వైద్యవిద్య అంటేనే చదవడం ద్వారా నేర్చుకున్నదాని కన్నా.. ప్రాక్టీస్లో అనుభవం ద్వారా నేర్చుకోవాల్సిందే ఎక్కువ. కానీ ఎయిమ్స్లో ఆపరేషన్ థియేటర్లు లేకపోవడం, ఇన్పేషెంట్లు రాకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టీస్ ఉండటం లేదు. కేంద్రం ఒంటెత్తు పోకడల వల్ల విద్యార్థులు అన్యాయానికి గురవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారికి భువనగిరిలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో ప్రాక్టీస్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
హాస్టల్ భవనాలు లేకపోవడంతో విద్యార్థులు బీబీనగర్, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అద్దె ఇండ్లలో ఉండి చదువుకోవాల్సి వస్తున్నది. దీంతో డబ్బు చాలక, ప్రయాణం, వంట వంటివాటితో చదవడానికి సమయం సరిపోక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
ప్రచార డంబాచారం
బీబీనగర్ ఎయిమ్స్ వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. బీజేపీ మాత్రం తమ అనుకూల మీడియాలో ‘అద్భుతహాః’ అన్నట్టుగా కథనాలు రాయిస్తున్నది. 18 అంతస్తులు నిర్మించాల్సిన భవనాలు ఇంకా ఒక్క అంతస్తు కూడా పూర్తి కాలేదు. 5 శాతం పనులు మాత్రమే అయ్యాయి. అయినా నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయంటూ ఊదరగొడుతున్నది. 500-600 వరకే ఓపీ వస్తుండగా.. 1,200 వరకు వస్తున్నదంటూ ‘డబుల్’ లెక్కలు చెప్తున్నది. వసతులు లేకున్నా.. 1,500 వరకు ఓపీ పెరుగుతున్నదని డంబాచారం చేస్తున్నది.
ఎయిమ్స్ దుస్థితికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ చిత్రం. ఇది వాలీబాల్ కోర్టో.. ఫుట్బాల్ కోర్టో కాదు.. ఎంబీబీఎస్ విద్యార్థులకు వసతి కల్పించేందుకు బహుళ అంతస్తులతో నిర్మించాల్సిన హాస్టల్ భవనం. మూడేండ్లుగా తరగతులు కొనసాగుతున్నా.. విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించలేదు. దీంతో విద్యార్థులు సొంత ఖర్చుతో బయట కిరాయిలకు ఉండాల్సిన పరిస్థితి.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది బీబీనగర్ ఎయిమ్స్లో ఆయుష్ విభాగం కోసం నిర్మిస్తున్న భవనం. ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నది. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.