కందుకూరు, అక్టోబర్ 6: ఫార్మాసిటీలో భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) రైతులకూ నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, వారికి దశలవారీగా పరిహార చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడకు చెందిన రైతు నీలం రాములు ఆత్మహత్య చేసుకోవటంతో బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. శనివారం రాత్రి గ్రామానికి వచ్చిన ఆమె.. రాములు భార్య సువర్ణ, కుమారుడు సురేశ్, కూతుళ్లు అఖిల, శిరీషను ఓదార్చారు. ఆత్మహత్యలు పరిష్కార మార్గాలు కావని అన్నారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. అతడి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తామని హామీ ఇచ్చి, ఆర్థిక సహాయం అందజేశారు. పీవోటీ రైతులకు నష్టపరిహారం చెల్లింపు యాచారం తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని, కందుకూరు ప్రాంత రైతులకూ పరిహారం అందుతుందని మంత్రి తెలిపారు. ధరణిలో చిన్నపాటి సమస్యలేవైనా ఉన్నట్టు రైతులు విన్నవిస్తే వెంటనే వాటిని పరిష్కారించాలని తాసిల్దారు జ్యోతిని మంత్రి ఆదేశించారు.