Satyavathi Rathod | హైదరాబాద్ : మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమభవన్లోని జీసీసీ కార్యాలయంలో (గిరిజన సహకార సంస్థ) ఆమె 30 మందికి ఆమె కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జీసీసీ ఉద్యోగులు సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటును అందిచాలని సూచించారు. ఇప్పటికే జీసీసీ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందని, జీసీసీ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాలని ఆమె దిశానిర్దేశం చేశారు. జీసీసీని నమ్ముకుని విధుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, అందులో భాగంగానే మానవీయ కోణంలో ఆ కుటుంబాల నుంచి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ జీసీసీ శానిటైజర్ ఉత్పత్తి చేయటం వల్ల జీసీసీ కేవలం అటవీ ఉత్పత్తులనే కాకుండా సమాజ అవసరాలను తీర్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల అభ్యన్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆమె వివరించారు. రాష్ట్రంలో 2014 నుంచి గిరిజనులకు స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తున్నదన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం, సంక్షేమ దినోత్సవం అద్భుతంగా జరుపుకున్నామని దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలతోపాటు, చిరు ఉద్యోగులను సైతం గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారని ఆమె ఉదహరించారు.
ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి, జీసీసీ జీఎం సీతారాంనాయక్, చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.