హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. దీనికోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజయన్ల పరిధిలో ఉన్న జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్లలోని స్థలాలు, స్టాళ్లు, దుకాణాలను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం వేర్వేరుగా ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎంజీబీఎస్, కోఠి బస్టాండ్లలో కూడా గతంలోనే టెండర్లను పిలిచినా, మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కాచిగూడ, మేడ్చల్, శామీర్పేట, హకీంపేట వంటి ప్రధాన ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న భూములను అద్దెకు ఇచ్చేందుకూ సంస్థ సిద్ధమైంది. ఆ భూముల్లో అన్నిరకాల దుకాణాలు, హోటళ్లు, ఫుడ్ స్టాళ్లు, పారింగ్, లాజిస్టిక్స్ (కార్గో పార్సిల్ సేవలు), డార్మెటరీ, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లు, షోరూమ్లు, ఇన్ సిటీ వేర్ హౌజ్లు ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతున్నది. టెండర్ ప్రక్రి య, దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఉదయం 10.30 నుంచి సాయం త్రం 5 వరకు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ను 9959224433 నంబర్లో సంప్రదించాలని సంస్థ పేర్కొన్నది. ఆసక్తి గల వారు ఆన్లైన్లో ఈ -టెండర్లను దాఖలు చేయడానికి మార్చి 15వరకు గడువు నిర్ణయించారు.