నేడు, రేపు నిరసనలకు కేటీఆర్ పిలుపు
మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారా? రాష్ర్టాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్ ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారింది. మోదీ రాకముందు రూ.410 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. గ్యాస్ ధరల పెంపుదలకు నిరసనగా గురు, శుక్రవారాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మహిళా దినోత్సవం రోజున కూడా నిరసన తెలుపాలె. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 1 (నమస్తే తెలంగాణ): దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ.50 పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 చొప్పున పెంచినట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు వెల్లడించాయి. తాజా వడ్డింపుతో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,325, గృహ వినియోగ నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.1,155కు ఎగబాకింది. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న ఈ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. కాగా, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను 4 శాతం తగ్గించారు. దీంతో వెయ్యి లీటర్ల ఏటీఎఫ్ రూ.4,606.50 తగ్గి రూ.1,07,750.27కు దిగివచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి గ్యాస్ వాతలు పెడుతూనే ఉన్నది.
గత తొమ్మిది సంవత్సరాలుగా తరచూ డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచుతూ షాక్ల మీద షాక్లు ఇస్తున్నది. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోదీ ప్రభుత్వం.. మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చింది. 2014లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.410.50 ఉంటే.. తాజా పెంపుతో ఏకంగా రూ.1,155కు చేరింది. తొమ్మిదేండ్లలో కేవలం డొమెస్టిక్ సిలిండర్ ధరనే రూ.744.50 పెంచింది. అంటే దాదాపు 178 శాతం పెరిగిందన్నమాట.
ప్రతి దానిపైనా పెంపు ప్రభావం
కమర్షియల్ సిలిండర్ ధరను కూడా మోదీ సర్కారు అమాంతంగా పెంచేసింది. నిన్నటిదాకా రూ.1974.50 ఉంటే.. బుధవారం మరో రూ.350.50 పెంచారు. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,325 చేరింది. దీని ప్రభావం వ్యాపార వర్గాల మీదనే కాకుండా పరోక్షంగా సామాన్యుడి మీద కూడా పడనున్నది. గ్యాస్ బండ ప్రియం కావటంతో హోటళ్లలో మెనూల ధరలు మారిపోయే అవకాశం ఉన్నది. రోడ్డు వెంట ఉండే సాధారణ బండి దుకాణం నుంచి స్టార్ హోటళ్ల వరకు గ్యాస్ ధర పెంపు ప్రభావం పడనున్నది. సిలిండర్ ధర పెరగడంతో ఇక నుంచి వ్యాపారులు సింగిల్ చాయ్ నుంచి బిర్యానీ వరకు ధరలను పెంచేందుకు సిద్ధమయ్యారు. బండ్ల మీద అమ్మే టిఫిన్ల ధరలు కనీసం రూ.10 వరకు పెరిగే అవకాశం ఉన్నదని వ్యాపారులు చెప్తున్నారు.
పూర్వం లాగే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ మహబూబాబాద్ జిల్లా కుమ్మరికుంట తండాకు చెందిన నూకల కేతమ్మ. పెరిగిన వంట గ్యాస్ ధరలు భరించలేక గ్యాస్ సిలిండర్ను, పొయ్యిని అటకెక్కించి పూర్వంలాగే కట్టెలతోనే వంట చేస్తున్నది.
పేదలపాలిట శత్రువు.. ప్రధాని మోదీ
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పేదలపాలిట శత్రువని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనే ని సాంబశివరావు విమర్శించారు బుధవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆయన మాట్లాడు తూ.. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్యు లు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని, అసమానతలు, నిరుద్యోగం పెరిగి సామాన్యుడి కొనుగోలు సామర్థ్యం అట్టడుగు స్థాయికి పడిపోయిందన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు డు ఎన్ బాలమల్లేశ్ పాల్గొన్నారు.
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెం టనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. వంటగ్యాస్ సిలిండర్కు రూ.50, కమర్షియల్ సిలిండర్కు రూ.350.50 పెంచడం వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతున్నద న్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతుంటే, కేంద్రం తాజా నిర్ణయంతో మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర, ప్రస్తు తం రూ.1155కు చేరిందని పేర్కొన్నారు. ఈ భారం మోయలేక ఇప్పటికే 10 శాతం ఉజ్వల వినియోగదారులు గ్యాస్ బండను అటకెకించారని తెలిపారు. ఇతర సామాన్యులు కూడా గ్యాస్ వినియోగానికి దూరమౌతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పేదలపై పడుతున్న ఈ భారాలపై స్పందించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని డిమాండ్ చేశారు.
కూలి పనిచేసి బతికేటోళ్లం
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న. గతంల గ్యాస్ ధర తక్కువ ఉండె. గ్యాస్ పొయ్యిమీదే వంట చేసుకొనేటోళ్లం. బీజేపీ వచ్చినంక ధర పెరుగుతున్నది. గంతగనం పైసలువెట్టి గ్యాస్ బండ కొనాలంటె కండ్ల నీళ్లు వస్తున్నయ్. అందుకే గ్యాస్ పొయ్యి వాడుడే బందువెట్టినం. కూలి పనిచేసి బతికేటోళ్లం. ఇగేం కొంటం. అందుకే ఇంట్ల గ్యాస్ బండను సజ్జమీద వేసినం.
– తొగరి మైసక్క, ఎల్కేశ్వరం, మహదేవపూర్ మండలం, భూపాలపల్లి జిల్లా
గిట్ల ధర పెంచితే ఎట్ల బతకాలె ?
రోజు కూలి పనిచేసుకొనేటోళ్లం. గింత ధర పెట్టి గ్యాస్ బండ కొనుక్కునుడంటే చానా ఇబ్బంది. ఉప్పు, పప్పు సహా ఏ పూటకాపూట కొనుక్కొచ్చుకుంటం. బీజేపీ సర్కారు పుణ్యమా అని గ్యాస్ పొయ్యిమీద వంట వండే రోజులు పోయినయి. కట్టెలు తెచ్చుకొని వంట చేసుకొంటున్నం. బీజేపీని ఓడగొడితెనే గ్యాస్ ధర తగ్గుతది.
– నాగమణి, నిమ్మగూడెం, మహాముత్తారం మండలం, భూపాలపల్లి జిల్లా
ఇగ గ్యాసుపొయ్యి వాడినట్టే..!
కేంద్రపోళ్లు గీ తీరుగ గ్యాసు ధర పెంచుకుంటవోతె ఇగ గ్యాస్ పొయ్యి వాడినట్టే. గీ కామన ధరలు పెంచితే మా అసోంటోళ్లు ఎట్ల బతుకాలె ? గ్యాస్ బండ కొందామంటె పైసల్లేక కట్టెల పొయ్యి మీద వండుకొంటున్నం. మళ్లా పాతరోజులే వచ్చినయి. ఆరోగ్యం పాడైతాంది. గిన్నెలు కరాబైతాన్నయ్. గరీబోళ్ల కష్టాలు తీర్చే సర్కారు ఉండాలె గని గిట్ల బతుకుడే కష్టంజేత్తె ఎట్ల సారు ?
– కావటి సారమ్మ, గొల్లపల్లి, నడికూడ మండలం, వరంగల్ జిల్లా
మళ్లీ ఎన్కటి రోజులే వస్తున్నయ్
మంచిరోజులు వస్తయంటే ఏందో అనుకున్న. కేంద్ర సర్కారు పుణ్యమా అని మాకు మళ్లా కట్టెల పొయ్యే దిక్కయ్యింది. మొదట్ల గ్యాస్ వాడుర్రి, కట్టెల పొయ్యితోటి కండ్లు పోతయని చెప్పిర్రు. పైసలు లేకుంటె ఉట్టిగనే ఇచ్చినట్టు చేశిర్రు. ఇప్పుడు పైసలు ఎక్కువ పెంచి మళ్లా కట్టెల పొయ్యే దిక్కయ్యేటట్టు చేసిండ్రు. సబ్సిడీ పైసలు బ్యాంకుల పడతలేవు. ఎన్కటి రోజులే వచ్చినయి.
కట్టెలు తెద్దామంటె శాతనైతలేదు
రోజూ కూలి పనికి పోత. పైసలు వస్తెనే ఏమన్న తెచ్చుకొని వండుకతింటం. దినదినగండం లెక్క గడుస్తుంటే మీద పిడుగు వడ్డట్టు గ్యాస్ ధర ఊకూకె పెరుగుతాంది. పన్నెండు వందలదాక పోయింది. గంత ధర పెట్టి ఏం కొంటమని గ్యాస్ పొయ్యి బందువెట్టిన. పొలాల దిక్కుపోయి కట్టెలు ఏరుకచ్చుకొని వంట వండుతాన్న. గీ వైసుల కట్టెలు ఏరుకరావాల్నంటే శాతనైతలేదు. ధర ఇట్ల పెంచుతుంటే మా అసోంటోళ్ల గతేంగావాలె ?
– కందునూరి వెంకటమ్మ, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా
చిరువ్యాపారులకు ఇబ్బంది
నేను కర్రీ పాయింట్ నడుపుత. గ్యాస్ ధరను కేంద్రం మరోసారి పెంచడంతో చాలా ఇబ్బంది పడుతున్నం. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధర రూ.2,020కి చేరింది. ఇప్పుడు మరో రూ.350 పెంచి చిరువ్యాపారులను ఆగం చేసింది. ఎంతో కష్టపడి స్వయం ఉపాధి పొందుతున్న మాలాంటోళ్లు ఇంత ధర పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏం మిగులుతది ? ఇట్లనే కొనసాగితే బీజేపీకి తగిన బుద్ధి చెప్పుడు ఖాయం.
– బోయిని కుమారస్వామి, ఇల్లంద, వర్ధన్నపేట మండలం, వరంగల్ జిల్లా