హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఒకే తరహాలో కామన్ గ్రేడింగ్ విధానం అమల్లోకి రానున్నది. ఇందుకు నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్కు ఐఐటీ 18వ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐఐటీల వారీగా వేర్వేరుగా మార్కులకు గ్రేడింగ్ ఇచ్చే విధానానికి ముగింపు పలుకనున్నారు. భువనేశ్వర్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందప్రధాన్ అధ్యక్షతన ఐఐటీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో 23 ఐఐటీల డైరెక్టర్లు సహా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్పై జగదీశ్కుమార్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వగా, దీనిపై చర్చించి కామన్ గ్రేడింగ్ విధానాన్ని ఆమోదించారు. క్రెడిట్ల బదిలీ సహా ఇతర అంశాలపై అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. యూజీసీ, ఏఐసీటీఈ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్స్కూల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఎన్సీఈఆర్టీ, కేంద్ర విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.