హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ నిర్వహించాలని నిర్ణయించిన ఉన్నత విద్యామండలి.. పరీక్ష నిర్వహణ, విధివిధానాల ఖరారుకు ఆరుగురు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, పీజీఆర్ఆర్సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జీబీరెడ్డితో కమిటీని నియమిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత పీహెచ్డీ ప్రవేశాల విధానాన్ని పరిశీలించి, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు కల్పిందుకు 15 రోజుల్లో నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వ అనుమతితో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని అనుకుంటున్నారు. ఉస్మానియాలో అన్ని రకాల విభాగాలుండటంతో ఓయూకే అప్పగించడం ద్వారా ప్రశ్నపత్రాల రూపకల్పన, ఫలితాల విడుదల సులభమవుతుందని యోచిస్తున్నారు.
కాలేజీలు, కోర్సులు, మెటీరియల్ను పరస్పరం మార్చుకొనేందుకు తలపెట్టిన క్లస్టర్ విధానంపైనా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసినట్టు పాపిరెడ్డి వెల్లడించారు. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ సీతారామారావు ఉంటారని పేర్కొన్నారు. విధివిధానాల రూపకల్పనతోపాటు క్రెడిట్లను మార్చుకోవడం, వనరుల సద్వినియోగం వంటి అంశాలపై 15 రోజుల్లో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు.