హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్20/జనగామ చౌరస్తా: రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల సోమవారం లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ ఎస్ అరుణ.. కార్పెంటర్ వద్ద రూ.25 వేలు లంచం తీసుకుని అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన కార్పెంటర్ బీ వెంకటాచారి స్కూళ్లల్లో రూ.1,28, 593 విలువైన ఫర్నిచర్ వర్క్ చేశాడు. రూ.75 వేలకు సంబంధించిన రెండు చెక్కులు రిలీజ్ చేసిన ప్రిన్సిపాల్ అరుణ పెండింగ్లో ఉన్న రూ.53,592 చెక్కు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. రూ.25 వేలను లంచంగా బ్యాంక్ ఎకౌంట్కు బదిలీ చేయాలని సూచించారు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు అదే బ్యాంకుకు నగదు బదిలీ చేశారు. దీని ఆధారంగా ఏసీబీ అధికారులు అరుణపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. ఆమెకు సోమవారం నోటీసులు జారీ చేశారు. జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత రూ.40 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. లింగాల ఘనపురానికి చెందిన చెట్టిపల్లి రాజు జనగామలో నిర్మించిన భవనానికి మున్సిపాలిటీకి మార్ట్గేజ్ చేసిన 10 శాతం స్థలాన్ని రిలీజ్ చేయడానికి కమిషనర్ లంచం డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ఆమె చెప్పిన మేరకు రూ.40 వేల నగదును ఆమె కారు డ్రైవర్ నవీన్కు ఇస్తుండగా, ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారించి కమిషనర్ రజితతోపాటు నవీన్పై కేసు నమోదు చేసి మంగళవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ వెల్లడించారు.