కామారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డీలర్లకు కమీషన్ను రూ.70 నుంచి రూ.140కి పెంచారు. ప్రతి డీలర్కూ రూ.5లక్షల బీమా, ఆథరైజేషన్ రెన్యువల్ 2 నుంచి 5 సంవత్సరాల వరకు పెంపు, డీలర్ చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున రూ.10 వేలు, ప్రతి ఎంఎల్ఎల్ పాయింట్ దగ్గర వే బ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ కుటుంబానికి రూ.5లక్షల వరకు దవాఖాన ఖర్చుల కోసం హెల్త్కార్డులను జారీ చేయనున్నారు. దీంతో రేషన్ డీలర్లు సంతోషిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంపై వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. జిల్లాలో మొత్తం 579 రేషన్ షాపులు ఉండగా, 578 రేషన్ డీలర్లు ఉన్నారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది
తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించి, ప్రభుత్వం పరిష్కరించింది. రేషన్ డీలర్లు ఎన్నో ఏండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో క్వింటాలకు రూ.140 కమీషన్ పెంచడం ఎంతో మంచి నిర్ణయం. ఇతర సౌకర్యాలు కల్పించారు. కమీషన్ చెల్లింపులో గ్రామీణ, పట్టణ విభాగాలు చేసి, కమీషన్ ఇస్తే బాగుంటుంది.
– ఎం.విజయ్, రేషన్ డీలర్ల సంఘం ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షుడు
ఆర్థికంగా ఆసరా అవుతుంది
ఇంతకు ముందు ఉన్న కమీషన్ రెట్టింపు చేయడంతో మాకు ఆర్థికంగా చాలా ఆసరా అవుతుంది. కమీషన్ రూ.140 పెంచడం ఆనందంగా ఉంది. మాకు కమీషన్ పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఆసరాగా నిలుస్తుంది. డీలర్లను సైతం పట్టించుకున్నందుకు ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు.
-ప్రకాశ్, డోంగ్లి రేషన్ డీలర్
డీలర్లకు కమీషన్ పెంపు హర్షణీయం
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్కు, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు. ఈ పెంపుతో రేషన్ డీలర్లకు లాభం జరుగుతుంది. రేషన్ డీలర్ల కమీషన్ను క్వింటాలుకు రూ.70 నుంచి 140కి పెంచారు. అలాగే బీమా సౌకర్యం, హెల్త్ కార్డు ఇవ్వడం హర్షణీయం. డీలర్లు సంతోషంగా ఉన్నారు.
– ఖయ్యూం నిషాత్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు