జ్యోతినగర్, మార్చి 24: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తి నమోదైంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1,600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకోగా, మొదటగా 800 మెగావాట్ల ఒకటవ యూనిట్లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 104.9 మెగావాట్ల ఉత్పత్తి నమోదైనట్టు యాజమాన్యం వెల్లడించింది.
విద్యుత్తు ఉత్పత్తి కోసం ఇటీవల యాజమాన్యం సన్నాహాలు చేయగా, కొన్ని రోజులపాటు యూనిట్లో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. సాంకేతిక సమస్యలు ఏర్పడినా వాటిని అధిగమించిన అధికారులు ఎట్టకేలకు యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి నమోదుతో పవర్ను గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఉత్పత్తి సక్సెస్ కావడంతో అధికారులు సంబురాలు చేసుకున్నారు.
కేక్కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కాగా ప్రాజెక్టుకు ఇటీవలే ఎన్టీపీసీకి సింగరేణి నుంచి చేసుకున్న 4.0 లక్షల టన్నుల ఎంవోయూ బొగ్గు దిగుమతితో 1వ యూనిట్లో చేపట్టిన ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతంతో యూనిట్ను ఉత్పత్తి దశలోకి తెచ్చేందుకు ఈ నెల 14న అధికారులు యుద్ధప్రాతిపదికన యూనిట్ను లైటాఫ్ చేశారు. వారం రోజు ల తరువాత విద్యుత్తు ఉత్పత్తి నమోదైంది.