ఖైరతాబాద్/ఖమ్మం/హనుమకొండ, మే 28: ఇటు చిత్ర పరిశ్రమ, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని ఘాట్ వద్ద ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసును గెలిచిన మహోన్నతుడని కీర్తించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి, పరిశ్రమలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని, ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటనానైపుణ్యంతో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. తెలంగాణ ప్రజల మనసు గెలిచారని చెప్పా రు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.