హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం ఎనలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. మంగళవారం కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు. సేవలను, అమరుల పోరాటాలను సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు. దశాబ్దాలపాటు కొనసాగిన తెలంగాణ ప్రాణ త్యాగాల పరంపరను స్వయం పాలనలో ప్రగతి ప్రస్థానంతో నిలువరించగలిగామని, నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన గోదావరి నదీలోయ తదితర ప్రాంతాలు నేడు కాళేశ్వరం జలాలతో పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. నాటి త్యాగాల ప్రతీకల స్థానంలో కొత్త ప్రగతి ఆనవాళ్లు సంతరించుకొన్నాయని తెలిపారు. అమరుల ఆకాంక్షలను నిజం చేస్తూ, ఉద్యమ లక్ష్యాన్ని సాధించుకుంటూ కేవలం తొమ్మిదేండ్లల్లోనే తెలంగాణ సమాజానికి భవిష్యత్తుపై ఒక భరోసాను నింపగలిగామని వెల్లడించారు. అన్ని రంగాలను పునరుజ్జీవింప చేసుకొంటూ తెలంగాణను పునర్ నిర్మించుకొంటూ సాగుతున్న స్వయం పాలన దేశానికే ఆదర్శంగా నిలువడం వెనుక అమరుల ఆశయాల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని తెలిపారు. వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం వంటి సకల మౌలికవసతులను తీర్చిదిద్దడం ద్వారా నేడు తెలంగాణ గుండెనిబ్బరంతో ఉన్నదని ఆనందం వ్యక్తంచేశారు. అభద్రతా భావాన్ని వీడి నేడు సబ్బండ వర్ణాలు అభివృద్ధి పథంలో పయనిస్తూ సంతోషంతో జీవిస్తున్నాయని వివరించారు. అమరుల ఆశయాల సాధనే అత్యున్నత కర్తవ్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. తెలంగాణ అమరుల మ హోన్నత త్యాగాలను సమున్నతంగా గౌరవించుకొనేందుకు, భవిష్యత్తు తరా లు, అమరుల త్యాగాల చరిత్రను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిగడ్డపై దశాబ్ది ఉత్సవాల చారిత్రక సందర్భంలో ‘తెలంగాణ అమర జ్యోతి’ని ప్రజ్వలనం చేసుకున్నామని గుర్తుచేశారు. అమరుల స్మారకం మనకు నిత్య స్ఫూర్తినందిస్తుందని, దొడ్డి కొమురయ్య త్యాగాన్ని స్మరించుకొనే దిశగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.