హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) స్పష్టంచేసింది. మిగతా రూ.5,000 కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకూ కాలేజీల బంద్ పాటిస్తామని ఫతి చైర్మన్ నిమ్మటూరి రమేశ్బాబు తేల్చిచెప్పారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన ఫతి కార్యవర్గ సమావేశం అనంతరం రమేశ్బాబు మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం యాజమాన్యాలు పోరాడాల్సిన పరిస్థితి దాకా సర్కార్ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.
అసలు విద్యార్థులు, కాలేజీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కావా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కాలేజీలు బంద్ పాటిస్తుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదని, ఈ సమస్యను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టిందని నిలదీశారు. అధ్యాపకులకు జీతాలిచ్చే పరిస్థితి లేకపోవడవంతోనే తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము బంద్కు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు ‘తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ’గా పేరు పెట్టామని, లక్షన్నర మంది అధ్యాపకులతో ఈ సభ జరుగుతుందని తెలిపారు. 10 లక్షల మందితో చలో హైదరాబాద్ పేరిట ఇదే నెల 11న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కమిటీలో అనర్హులు
తాము 4 నెలల క్రితం రూ.లక్ష కోట్లతో ట్రస్ట్బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామని, కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు జారీచేసిన జీవో తాము ఆశించిన విధంగా లేదని రమేశ్బాబు తెలిపారు. నివేదిక గడువును మూడు నెలల్లో కాకుండా నెల రోజుల్లోపే తెప్పించుకోవాలనాని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్పై వేసిన కమిటీలో అనర్హులు ఉన్నారని, అవగాహన లేని వ్యక్తులతో ఆ కమిటీ వేశారని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్చేశారు. ఆర్బీఐ గవర్నర్, ఎస్బీఐ చీఫ్, బ్యాకింగ్ రంగ నిపుణులతో కమిటీని వేయాల్సి ఉండెనని చెప్పారు. కాలేజీలపై విజిలెన్స్ దాడులకు దిగడం నిరంకుశత్వమని, ఈ విచారణను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీదేవసేన బెదిరించారు : ఫతి
విద్యాశాఖ ఇన్చార్జి కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తమను బెదిరించారని ఫతి చైర్మన్ రమేశ్బాబు ఆరోపించారు. ఆమె తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. ‘యూజ్లెస్ కాలేజెస్’ అంటూ ప్రైవేట్ కాలేజీలను అవమానించారని ఆరోపించారు. శ్రీదేవసేనను పదవుల నుంచి తప్పించాలని, లేదా బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యాలకు మధ్య వారధిగా, సంధానకర్తగా వ్యవహరించాల్సిన ఆమె.. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఫతి సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్, వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డాక్టర్ బొజ్జ సూర్యనారాయరెడ్డి, కోశాధికారి కొడాలి కృష్ణారావు, డాక్టర్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.